జనగామ : దేశంలో అంబేద్కర్ తర్వాత అంతగా దళితుల గురించి ఆలోంచి, వారి కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా దళిత బంధు అనే పథకాన్ని ప్రారంభించిన ఘతన సీఎం కేసీఆర్కే దక్కుతుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో రూ. 5 కోట్ల విలువైన 50 యూనిట్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబ్లె మాట్లాడుతూ.. దళిత బంధును జిల్లాలో 185 మంది లబ్ధిదారులకు 18 కోట్ల 50 లక్షలు మంజురు చేయగా.. పాలకుర్తి నియోజకవర్గంలో 5 కోట్లతో 50 యూనిట్లు మంజూరు చేశామన్నారు. జనగామ నియోజకవర్గంలో 60 యూనిట్లు, స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో 75 యూనిట్లు ఇస్తున్నామన్నారు. 185 యూనిట్లకు ఇప్పటికే నిధులు మంజూరయ్యాయి.
రూ.18 కోట్ల 50 లక్షల నిధులు విడుదలయ్యాయని మంత్రి వివరించారు. కాగా, పాలకుర్తి మండలంలోని తీగారం గ్రామంలో 20 మందికి, దేవరుప్పుల మండలంలోని బంజర గ్రామంలో 15 మందికి, కొడకండ్ల మండలంలోని రామన్నగూడెం గ్రామంలో 15 మందికి మొదటి విడతగా వారు కోరుకున్న యూనిట్లనే ఇచ్చినట్లు మంత్రి తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి 196 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జనగామ జెడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శివ లింగయ్య, అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, జెడ్పీ సీఈవో విజయలక్ష్మి, డీఆర్డీవో రామ్ రెడ్డి, జిల్లా ఎస్సీ సంక్షేమాధికారి కుర్నేలియస్, తదితరులు పాల్గొన్నారు.