హైదరాబాద్ : న్యాయవాదుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని, సమస్యలుంటే పరిష్కారానికి సహకారం అందిస్తామని న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. అరణ్య భవన్లో శనివారం న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డిని తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్ నరసింహారెడ్డి, ఇతర కౌన్సిల్ సభ్యులు కలిసి, న్యాయవాదుల సంక్షేమానికి సంబంధించిన పలు అంశాలపై వినతిపత్రం అందజేశారు. తెలంగాణ న్యాయవాదుల సంక్షేమ నిధికి ప్రతి ఏడాది రూ.10కోట్ల మ్యాచింగ్ గ్రాంట్ మంజూరు చేయాలని, దీంతో ఫండ్లోని సభ్యులకు, మరణించిన న్యాయవాదుల కుంటుంబాలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని మంత్రికి వివరించారు.
అలాగే మరణించిన న్యాయవాది నామినీకి న్యాయవాదుల సంక్షేమం నిధి ద్వారా రూ.4లక్షలు చెల్లిస్తున్నామని, ప్రభుత్వం తరఫున అదనంగా మరో రూ.4లక్షలు చెల్లించాలని, అంతేకాకుండా వెల్ఫేర్ ఫండ్ స్టాంప్లను ప్రభుత్వ న్యాయవాదులు (లా అఫీసర్స్) అతికించడం లేనందున న్యాయవాదుల సంక్షేమ నిధికి సంవత్సరానికి రూ.10 కోట్లు మంజూరు చేయాలని, జూనియర్ న్యాయవాదులకు మూడు సంవత్సరాల కాల పరిమితికి ప్రతి నెల రూ.5వేల ఉపకార వేతనం చెల్లించేలా ప్రభుత్వం తరఫున చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. న్యాయవాదుల రక్షణకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ అంశాలపై సానుకూలంగా స్పందించిన మంత్రి.. సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని, ఈ అంశాలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని వారికి హమీనిచ్చారు.
దేశంలో ఎక్కడాలేని విధంగా తొలిసారిగా న్యాయవాదుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించిందని, నిధుల నిర్వహణ బ్యాధతను అడ్వకేట్ వెల్ఫేర్ ట్రస్ట్కు అప్పగించిందని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ట్రస్ట్ ద్వారా వేలాది మంది న్యాయవాదులకు ఇన్సూరెన్స్ పాలసీలు అందిస్తున్నామని, కరోనా సమయంలో 15వేల మందికిపైగా అడ్వకేట్లు, క్లర్కులకు రూ.25కోట్లును సహాయంగా అందించామని తెలిపారు. మంత్రి కలిసి వారిలో రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు గండ్ర మోహన్ రావు, రాజేందర్ రెడ్డి, అనంతసేన్ రెడ్డి, కొండారెడ్డి, జితేందర్ రెడ్డి, ఫణీంద్ర భార్గవ్, ముఖీద్, మధుసుదన్ రావు, జనార్దన్ రామారావు, పాలకుర్తి కిరణ్, భుజంగరావు, న్యాయశాఖ అదనపు కార్యదర్శి మన్నన్ పాల్గొన్నారు.