హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): సావనైనా సస్తాంగానీ ఢిల్లీ దొరల ముందు కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వం తలవంచదని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తేల్చి చెప్పారు. సీఎం కేసీఆర్ చేతిలో ఉంటేనే తెలంగాణ సురక్షితంగా ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలని నిర్ణయించేది తెలంగాణ ప్రజలే తప్ప.. మోదీ, రాహుల్గాంధీలు కాదని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ గత రెండు ఎన్నికల్లోనూ ప్రజలను మాత్రమే నమ్ముకున్నదని చెప్పారు. ఇప్పుడు కూడా తెలంగాణ సీఎంగా ఎవరుండాలి? ఈ రాష్ర్టాన్ని ఎవరి చేతిలో పెట్టాలి? అని ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. జలవిహార్లో శనివారం నిర్వహించిన ‘10 వసంతాల తెలంగాణలో-న్యాయ వ్యవస్థ ప్రగతిపథం’ తెలంగాణ న్యాయవాదుల ఆత్మీయ సమ్మేళనానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యా రు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దొరల తెలంగాణ కావాలా? ప్రజల తెలంగాణ కావాలా? అని రాహు ల్ గాంధీ అంటున్నారని.. ఢిల్లీ దొరలకు, నాలుగు కోట్ల ప్రజలకు మధ్య ఇప్పుడు పోరాటం జరుగుతున్నదని చెప్పారు. 1969 ఉద్యమంలో 370 మందిని పిట్టలను కాల్చినట్టు కాల్చి చంపింది రాహుల్గాంధీ నాయనమ్మ అని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది యువకుల చావుకు కారణం ఢిల్లీ కాంగ్రెస్ నాయకులేనని, అందుకే సోనియాగాంధీని ప్రస్తుత టీపీసీసీ అధ్యక్షుడు బలిదేవతగా అభివర్ణించిన విషయాన్ని గుర్తు చేశారు.
పైసలు పంచుకుంటూ అడ్డంగా దొరికిన రేవంత్రెడ్డి.. సీఎంని గన్పార్క్ వద్దకు రమ్మని అనడం సిగ్గుచేటని మండిపడ్డారు. వచ్చేది లేదు.. సచ్చేది లేదుగానీ.. బీజేపీ బీసీ సీఎంను చేస్తదట అని ఎద్దేవా చేశారు. అంబర్పేటలో పోటీచేస్తే ఓడిపోతానని కిషన్రెడ్డికి తెలిసే.. కాలేరు వెంకటేశ్ మీద నిలబడేందుకు భయపడ్డారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఉద్యోగులకు 73 శాతం ఫిట్మెంట్ ఇచ్చామన్న కేటీఆర్.. మన కడుపుకొట్టే కాంగ్రెస్ కావాలా? కడుపు నింపే బీఆర్ఎస్ ప్రభుత్వం కావాలా? అనేది ప్రజలు నిర్ణయించుకోవాలని కోరారు. రిస్క్ తీసుకొని తెలంగాణను ఇంకోని చేతులో పెట్టొద్దని సూచించారు.
తెలంగాణ ఏర్పాటు తర్వాతే ఇక్కడి న్యాయ వ్యవస్థలోని వారికి న్యాయం చేకూరిందని, హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 24 నుంచి 42కు పెంచుకోవడంతోపాటు కొత్త జిల్లాల్లో కోర్టులను ఏర్పాటు చేసుకున్నామని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎన్ని ఒడిదొడుకులు ఎదుర్కొన్నా.. న్యాయవాదులు వెనకడుగు వేయలేదని, విద్యార్థులతో సరిసమానంగా ఉద్యమం చేశారని చెప్పారు. ఉద్యమంలో వందల, వేల కేసుల్లో ఒక్క రూపాయి కూడా ఆశించకుండా తమతో నిలబడి, అండగా నిలిచారని ప్రశంసించారు. న్యాయవాదులందరికీ ధన్యవాదాలు తెలిపారు. న్యాయవాదుల డిమాండ్లను నెరవేర్చేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
తెలంగాణ రాకముందు 1.14 లక్షలు ఉన్న రాష్ట్ర తలసరి ఆదాయం.. ప్రస్తుతం 3.17 లక్షలకు చేరిందని కేటీఆర్ పేర్కొన్నారు. దేశంలో ఏ రాష్ర్టానికి ఇది సాధ్యం కాలేదని చెప్పారు. తెలంగాణ అభివృద్ధిపై రిజర్వ్ బ్యాంక్ తన నివేదికలో స్పష్టం చేస్తుంటే.. ప్రతిపక్షాలు మాత్రం అభివృద్ధి జరుగలేదని తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని మండిపడ్డారు. వ్యవసాయరంగంలో 68 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి మూడున్నర కోట్ల వరి ధాన్యం పండిస్తూ.. దేశానికి అన్నం అందిస్తున్న అన్నపూర్ణ తెలంగాణ అని పేర్కొన్నారు. హరితహారం ద్వారా 7.7 శాతం గ్రీనరీ పెరిగిందని, నగరానికి అనేక కొత్త పరిశ్రమలు వస్తున్నాయని చెప్పారు.