హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): గ్రూప్-1 పరీక్షా విధానంపై పిటిషన్ వేసిన అభ్యర్థులపై హైకోర్టు అగ్రహం వ్యక్తంచేసింది. ప్రిలిమ్స్లో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయడం లేదని హాల్టికెట్లో స్పష్టంగా ఉన్నదని, దీనిపై అభ్యంతరం ఉంటే హాల్టికెట్ అందుకోగానే కోర్టుకు ఎందుకు రాలేదని ప్రశ్నించింది. పరీక్షకు సంబంధించిన నిబంధనల్లో మార్పులు, చేర్పులు చేసే అధికారం తనకు ఉన్నదని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) నోటిఫికేషన్లోనే స్పష్టం చేసిందని గుర్తుచేస్తూ..
ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేయాలన్న పిటిషనర్ల చిత్తశుద్ధిపై పలు సందేహాలను వ్యక్తం చేసింది. ప్రిలిమ్స్ను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి వెలురించిన తీర్పును డిస్మిస్ చేయాలని టీఎస్పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ దాఖలు చేసిన అప్పీల్పై జస్టిస్ అభినంద్కుమార్ షావిలి, జస్టిస్ అనిల్కుమార్ జూలకంటి ధర్మాసనం మంగళవారం విచారణ కొనసాగించింది.
నోటిఫికేషన్ను సవరించే అధికారం
గ్రూప్-1 పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం నిరుడు అక్టోబర్లో ప్రిలిమ్స్ నిర్వహించిందని, కొందరి దుశ్చర్యల వల్ల ఆ పరీక్షను రద్దుచేసి మళ్లీ గత జూన్ 11న నిర్వహించిందని ధర్మాసనం గుర్తుచేసింది. ఇప్పుడు రెండోసారి పరీక్షను రద్దు చేయాలంటే లక్షల మంది అభ్యర్థుల పరిస్థితి ఏం కావాలని పిటిషనర్లను నిలదీసింది. నోటిఫికేషన్ను సవరించే అధికారం టీఎస్పీఎస్సీకి ఉన్నదని పేర్కొన్నది.
నోటిఫికేషన్ ప్రకారం బయోమెట్రిక్ అమలు చేయలేదన్న పిటిషనర్ల వాదనను ఆమోదించి గ్రూప్-1 పరీక్షను రద్దు చేస్తే.. తిరిగి మళ్లీ ఈ పరీక్షను నిర్వహించేటప్పుడు బయోమెట్రిక్ అవసరం లేదని టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ వెలువరిస్తే ఏం చేస్తారని ప్రశ్నించింది. ఒకవేళ ప్రిలిమ్స్ రద్దును ఆమోదిస్తే టీఎస్పీఎస్సీ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుందని, అదే జరిగితే మరింత జాప్యమవుతుందని వ్యాఖ్యానించింది.
ప్రిలిమ్స్ను కట్టుదిట్టగా నిర్వహించాం
టీఎస్పీఎస్సీ తరఫున అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదన వినిపిస్తూ.. ప్రిలిమ్స్కు హాజరైన లక్షల మంది అభ్యర్థుల నుంచి స్వల్ప సమయంలో బయోమెట్రిక్స్ను తీసుకోవడం సాధ్యమయ్యే పని కాదని, అందుకే ఆ విధానాన్ని అమలు చేయలేదని తెలిపారు. అయినప్పటికీ కట్టుదిట్టంగా ఈ పరీక్ష నిర్వహించామని, ఒకరికి బదులు మరొకరు ప్రిలిమ్స్ రాయకుండా నిరోధించేందుకు ప్రభుత్వం జారీచేసిన ఫొటో గుర్తింపు కార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే అభ్యర్థులను పరీక్షకు అనుమతించామని చెప్పారు.
పరీక్ష రద్దును కోరుతున్నది ముగ్గురే
ఊహాజనిత అంశాల ఆధారంగా కేవలం ముగ్గురు అభ్యర్థులు మాత్రమే పరీక్ష రద్దు చేయాలని కోరుతున్నారని అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ తెలిపారు. దీన్ని పట్టించుకోకుండా సింగిల్ జడ్జి వెలువరించిన తీర్పును రద్దు చేయాలని, లక్షల మంది అభ్యర్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని గ్రూప్-1 పోస్టుల భర్తీకి న్యాయపరమైన అవరోధాలు లేకుండా చూడాలని హైకోర్టు డివిజన్ బెంచ్ను కోరారు.
విచారణ నేటికి వాయిదా
న్యాయవాది నర్సింగ్ తరఫున సీనియర్ న్యాయవాది ఏ గిరిధర్రావు వాదన వినిపిస్తూ.. గ్రూప్-1 పరీక్షలకు బయోమెట్రిక్ విధానం ఉండాల్సిందేనని చెప్పారు. గతంలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షకు 6 లక్షల మంది హాజరైనప్పుడు బయోమెట్రిక్ అమలు చేశారని, గ్రూప్-1 ప్రిలిమ్స్కు 2.33 లక్షల మందే హాజరయ్యారని తెలిపారు. నిరుడు అక్టోబర్లో ప్రిలిమ్స్కు ఎంతమంది హాజరయ్యారో, ఎన్ని కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారో తెలియజేయాలని ధర్మాసనం టీఎస్పీఎస్సీని ఆదేశించింది. గతంలో ఏఏ పరీక్షలకు బయోమెట్రిక్ అమలు చేశారో చెప్పాలని పేర్కొంటూ.. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది.
లాజిస్టిక్స్ సమస్య కారణంగానే..
పరీక్షల నిర్వహణకు రూ.1.30 కోట్లు ఖర్చవుతుందన్న కారణంతోనే బయోమెట్రిక్ను అమలు చేయలేదన్న వాదనను అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వ్యతిరేకించారు. లాజిస్టిక్స్ సమస్య కారణంగానే బయోమెట్రిక్ను అమలు చేయలేదని స్పష్టం చేశారు. యూపీఎస్సీ పరీక్షల్లో కూడా బయోమెట్రిక్ విధానాన్ని అవలంబించడం లేదని గుర్తుచేశారు. ప్రాథమిక సమాచారం ఆధారంగా ప్రిలిమ్స్కు 2,33,348 మంది హాజరైనట్టు ప్రకటించామని, పూర్తి సమాచారం అందాక మొత్తం 2,33,506 మంది పరీక్షకు హాజరైనట్టు తేలడంతో ఆ విషయాన్ని టీఎస్పీఎస్సీ వెబ్నోట్లో పేరొన్నామని వివరించారు.