హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాతే బ్రాహ్మణ పరిషత్ స్థాపనతో బ్రాహ్మణులకు సముచిత స్థానం లభించిందని, అంతకుముందు ఉన్న ప్రభుత్వాలు బ్రాహ్మణుల సంక్షేమం కోసం ఎలాంటి చర్యలు చేపట్టలేదని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి అన్నారు. బ్రాహ్మణులు లోకకల్యాణం కోసం పాటుపడుతారని, సర్వేజనా సుఖినోభవంతుకు దిక్సూచిగా బ్రాహ్మణ కమ్యూనిటీ గుర్తింపు పొందిందని పలువురు వక్తలు పేర్కొన్నారు. తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో తులసి శ్రీనివాస్ అధ్యక్షతన ఆదివారం హిమాయత్నగర్లో ‘బ్రహ్మగర్జన’ సన్నాహక సమావేశం నిర్వహించారు.
ముఖ్య అతిథులుగా కేవీ రమణాచారి, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్బాబు, ఇరిగేషన్ కార్పొరేషన్ చైర్మన్ సముద్రాల వేణుగోపాలచారి, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్రావు హాజరై మాట్లాడారు. బ్రాహ్మణ దామాషా ప్రకారం చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించాలని సమావేశంలో పాల్గొన్న పలువురు బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. త్వరలో నిర్వహించనున్న బ్రహ్మగర్జనకు సిద్ధం కావాలని రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల నుంచి వచ్చిన బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులకు సూచించారు. సమావేశంలో బాలానగర్ మాజీ కార్పొరేటర్ కాండూరి నరేంద్రాచార్య, హైదరాబాద్లోని పలు బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు, కోనసీమ బ్రాహ్మణ ద్రావిడ సంఘం, కర్ణాటక బ్రాహ్మణ సేవా సంఘం, మరాఠా బ్రాహ్మణ సేవా సంఘం, శ్రీవైష్ణవ సేవా సంఘం, శ్రీగాయత్రి సేవా సంఘం, ఆలిండియా బ్రాహ్మణ సేవా సంఘం నాయకులు, పలువురు ఆస్ట్రాలజిస్టులు పాల్గొన్నారు.