హైదరాబాద్ : పేద ప్రజల ఆరోగ్యమే పరమావధిగా సీఎం కేసీఆర్(CM KCR) నగరం నలుమూలలా అధునాతన ఆసుపత్రులను నిర్మిస్తున్నారని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. గురువారం గడ్డిఅన్నారంలో పండ్ల మార్కెట్ స్థలంలో నిర్మిస్తున్న అధునాతన టిమ్స్ (TIMS) ఆసుపత్రి నిర్మాణ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు.
ఆయన మాట్లాడుతూ అనారోగ్య సమస్యలతో వైద్యం కోసం రాష్ట్రం నలుమూలల నుంచి గ్రేటర్ హైదరాబాద్(Greater Hyderabad)కు ప్రజలు వస్తున్నారని, వారికి వైద్య సేవలు అందిస్తున్న నిమ్స్(Nims), ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల(Gandhi Hospital)పై అధిక భారం పడుతుందన్నారు. ఈ ఇబ్బందులను తొలగించేందుకు సీఎం కేసీఆర్ నగరం నలుమూలలా హాట్స్పాట్ కేంద్రాలను గుర్తించి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల (Super Speciality Hospitals)నిర్మాణానికి శ్రీకారం చుట్టారన్నారు.
దాదాపు రూ. 1200 కోట్లతో నిర్మాణం అవుతున్న గడ్డిఅన్నారం టిమ్స్ ఆసుపత్రి వెయ్యి పడకలతో అధునాతన హంగులతో అందుబాటులోకి రానున్నదని వివరించారు. ఈ ఆసుపత్రి నిర్మాణంతో పాటుగా స్థానిక అవసరాల దృష్ట్యా 2400 గజాల్లో ఉద్యానవనం, 3000 గజాల స్థలంలో పోలీస్స్టేషన్, 2000 గజాల స్థలంలో విద్యుత్ సబ్స్టేషన్, వెయ్యి గజాల స్థలంలో నూతన మంచినీటి రిజర్వాయర్, 500 గజాల చొప్పున దేవాలయం, మజీద్ల నిర్మాణాలు చేయబోతున్నామన్నారు. ఆసుపత్రికి వచ్చే వారి కోసం మల్టీలేవల్ పార్కింగ్ సౌకర్యం కల్పించబోతున్నామని వెల్లడించారు. ఆయన వెంటఅధికారులు భాస్కర్రెడ్డి, సుభాష్, బీఆర్ఎస్ నాయకులు తోట మహేష్ యాదవ్, భూపేష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.