హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రంలో వీఆర్వో వ్యవస్థను రద్దు పరిచి వారిని ఇతర శాఖల్లోకి బదలాయింపునకు వీలు కల్పించిన జీవోను సవాల్ చేసిన పిటిషన్లపై వాదనలు ముగిశాయి. తీర్పును తర్వాత వెలువరిస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎన్ తుకారాంజీలతో కూడిన ధర్మాసనం ప్రకటించింది. చట్ట వ్యతిరేకంగా వీఆర్వో వ్యవస్థను ప్రభుత్వం రద్దు చేసిందని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు చేసిన వాదనలను ప్రభుత్వం వ్యతిరేకించింది.
వీఆర్వో వ్యవస్థ లేకపోవడం వల్ల రెవెన్యూశాఖ పనులు ఏమీ ఆగలేదని చెప్పింది. రెవెన్యూశాఖను డిజిటలైజేషన్ చేయడంతోపాటు ధరణి పోర్టల్ను ప్రారంభించినట్టు తెలిపింది. వీఆర్వో వ్యవస్థను రద్దు చేసి వాళ్లను ఇండ్ల్లకు పంపలేదని, వేరే ప్రభుత్వశాఖల్లోకి సర్దుబాటు చేసిందని వివరించింది. వారికి జీతభత్యాలు మొదలైనవి చెల్లింపుల విషయంలో నష్టం ఏమీ చేకూరలేదని చెప్పింది. తీర్పును వాయిదా వేసిన హైకోర్టు.. ఇంకా ఎవరైనా వాదనలు చెప్పదలిస్తే రాతపూర్వకంగా ఈ నెల 28లోగా నివేదించాలని కోరింది.