ఆదిలాబాద్ : కాంగ్రెస్ పార్టీకి ప్రజలు కరెంట్ షాకిస్తున్నారు. రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వద్దని రైతాంగాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేసిన ఆ పార్టీ అధ్యక్షుడి వ్యాఖ్యలకు దిమ్మదిరిగే షాకిస్తూ కనువిప్పు కలిగిస్తున్నారు. రాష్ట్రంలో ఉచిత విద్యుత్ అవసరం లేదంటూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా..బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ నాయకుడు భూక్యా జాన్సన్ నాయక్ అధ్వర్యంలో ఇంద్రవెల్లి మండలం పాటగుడలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయద్దని తీర్మానంతో పాటు ప్రమాణం చేశారు.
ఈ సందర్భంగా భూక్యా జాన్సన్ నాయక్ మాట్లాడుతూ.. రైతే దేశానికి రాజు అని అన్నం పెట్టే రైతన్నను కించపరచినట్లు వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. వెంటనే రైతాంగానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులు బాగుపడడం కోసం వారిని ఏకం చేసిన ఏకైక నేత కేసీఅర్ అన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తుందని వ్యవసాయరంగం బలపడి దేశంలో అత్యధిక శాతం ఆధారపడ్డ ప్రజలు బాగుపడాలి అన్న లక్ష్యంతో తెలంగాణ ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. అన్నంపెట్టే రైతు శాసించే స్థితిలో ఉండాలి కానీ, యాచించే దుస్థితి రావద్దన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన అని పేర్కొన్నారు.
రైతుల కోసంఅనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు స్వచ్ఛంగా మద్దతు ఇస్తున్నారని, కాంగ్రెస్ పార్టీని రైతులు వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసి రైతుల కించపరిచి మాట్లాడడం సరికాదని హితవు పలికారు. వెంటనే యావత్ రైతాంగానికి రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.