హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): ప్రపంచంలోనే నూతన ఆవిష్కరణలకు అతిపెద్ద కేంద్రమైన టీ-హబ్ను మహారాష్ట్ర మాజీ మంత్రి, వర్లీ ఎమ్మెల్యే ఆదిత్య థాక్రే మంగళవారం సందర్శించారు. అనంతరం థాక్రే రాష్ట్ర మంత్రి కేటీఆర్తో టీ హబ్లో సమావేశమయ్యారు. టెక్నాలజీలోనే కాకుండా వివిధ రంగాల్లో సరికొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కేటీఆర్ ఆయనకు వివరించారు.
ఆదిత్య థాక్రే నగర శివారు గీతం విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. మహారాష్ట్ర వెనకబడి ఉండటం బాధాకరమని, అధికారంలో ఉన్న ప్రభుత్వం నిరంకుశ, నియంతృత్వ విధానాలను అవలంబిస్తున్నదని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీతో రాజకీయ పొత్తు ఉంటుందా అని కౌటిల్య విద్యార్థులు ప్రశ్నించగా, తాను మంత్రి కేటీఆర్ మంచి మిత్రులమని చెప్పారు. తరచూ కేటీఆర్తో మాట్లాడుతూనే ఉంటానని తెలిపారు. బీఆర్ఎస్తో పొత్తు అనే అంశం ఎన్నికల సమయంలోనే వస్తుందని చెప్పారు.