Soyam Bapu Rao | పార్లమెంట్ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ఎంపీ టికెట్పై బీజేపీ నేత, ఎంపీ సోయం బాపురావు ఆసక్తికర కామెంట్స్ చేశారు. గల్లీకో ఫ్లెక్సీ పెడితే టికెట్ రాదని స్పష్టం చేశారు. క్యాడర్ లేనోడు లేడర్ కాలేడని వ్యాఖ్యానించారు.
బీజేపీ ఎంపీ టికెట్ అంగట్లో సరుకు కాదని సోయం బాపురావు అన్నారు. తనపై కొందరు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఎంపీగా సోయం ఏం చేశాడో అధిష్ఠానానికి తెలుసని అన్నారు. కాంగ్రెస్ దొంగ పోరాటాలను సమర్థంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఆదిలాబాద్ ఎంపీగా ఉన్న ఉన్న సోయం బాపురావుకు ఈసారి బీజేపీ టికెట్ ఇస్తుందా? లేదా? అనేది కొద్దిరోజులుగా చర్చ జరుగుతోంది. ఇటీవల బోథ్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన సోయం దారుణంగా ఓడిపోయారు. దీంతో లోక్సభ ఎన్నికల్లో ప్రభావం చూపించగలరా? లేదా? అనే అనుమానాలు ఉన్నాయి. పైగా సాకటి దశరథ్, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్ కూడా ఆదిలాబాద్ ఎంపీ సీటు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఆదిలాబాద్ ఎంపీ సీటు బీజేపీ ఎవరికి కేటాయిస్తుందనే విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే సోయం మాత్రం ఈసారి కూడా తనకే బీజేపీ ఎంపీ టికెట్ ఇస్తుందనే ధీమాలో ఉన్నారు.