నర్మెట, జూన్ 13 : జనగామ జిల్లా నర్మెట మండల కేంద్రంలోని కాంగ్రెస్, బీఏస్పీ, ఎమ్మార్పీఎస్లకు చెందిన సుమారు 150 మంది కార్యకర్తలు సోమవారం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి వివిధ పార్టీల నాయకులు టీఆర్ఎస్లో చేరుతున్నారని అన్నారు.
సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంస్కరణలతో రాష్ట్రం ఏ రంగంలో చూసినా అభివృద్ధిలో ముందంజలో ఉందన్నారు. కేంద్ర మంత్రులు పలుమార్లు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని ప్రశంసించారని ఆయన గుర్తు చేశారు. అధికారంలో ఉన్న కేంద్ర బీజేపీ నేతలను రాష్ట్ర బీజేపీ నాయకులు ఎందుకు రాష్ర్టానికి రావాల్సిన వాటాను అడుగడం లేదని ప్రశ్నించారు.
పార్టీలో చేరిన వారికి తాము ఎప్పుడూ అండగా ఉంటామని పేర్కొన్నారు. కార్యకర్తలే పార్టీకి కొండంత అండని అన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు చింతకింది సురేష్, సర్పంచ్ ఆమెడపు కమలాకర్రెడ్డి, జడ్పీటీసీ మాలోత్ శ్రీనివాస్, జడ్పీ కోఅప్షన్ సభ్యుడు ఎండీ గౌస్, నర్మెట, తరిగొప్పుల మండలాల కన్వీనర్ పెద్ది రాజిరెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు కల్యాణం మురళి పాల్గొన్నారు.