పరిగి, మే 8 : టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నారని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. ఆదివారం వికారాబాద్ జిల్లా పరిగిలోని తన నివాసంలో కులకచర్ల మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు నాగని వెంకట్రాములు, 9వ వార్డు సభ్యురాలు నాగని లక్ష్మి, కాంగ్రెస్ మాజీ గ్రామ కమిటీ అధ్యక్షుడు దోమ బాబు, కాంగ్రెస్నాయకులు భీమ్సేన్, నాగని శ్రీనివాస్తోపాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్లో చేరారు.
వారందరికీ ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ప్రతి గ్రామంలో వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లోకి వలసలు ప్రారంభం కానున్నాయని ఆయన తెలిపారు. కార్యక్రమంలో కులకచర్ల మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు శేరి రాంరెడ్డి, మార్కెట్ చైర్మన్ హరికృష్ణ, మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు పీరంపల్లి రాజు తదితరులు పాల్గొన్నారు.