ముత్తారం, మార్చి 12 : ఆదర్శ పాఠశాల(Adarsha school) టీచర్లు ఆందోళన చెందుతున్నారు. మార్చి ఈ నెల మొదలై 12 రోజులవుతున్నా జీతాలు(Salaries) జమ చేయకపోవడంతో కుటుంబాలు పోషించుకునేదెలా..? అని ఆవేదన చెందుతున్నారు. మంగళవారం పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం దరియాపూర్ ఆదర్శ పాఠశాల టీచర్లు భోజన విరామ టైంలో నిరసన చేపట్టారు. ప్రతి నెలా 010 పద్దు ద్వారా వేతనాలు చెల్లించాలని ప్లకార్డులతో నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఫిబ్రవరి నెల వేతనాలు ఇప్పటివరకు చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, బ్యాంక్ ఈఎంఐలు సైతం కట్టలేకపోతున్నామన్నారు. ఈఎంఐలు సకాలంలో చెల్లించకపోవడంతో డిఫాల్టర్గా మిగిలిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా స్పందించి తమ సమస్యలు పరిషరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఎస్ ఎంఎస్ జేఏసీ ప్రతినిధులు ఆనంది శ్రీరాములు, రాఘవేంద్రరావు, రోబినా, సత్యనారాయణ, సక్రమ్ , స్వరూప, అనిల్ , కృష్ణమూర్తి, గోవిందరావు, రాజ్ కుమార్, రాజు, భూమయ్య, శ్రీనివాస్, లక్ష్మీ నర్సయ్య, శ్యామల ఉన్నారు.