న్యూఢిల్లీ, జనవరి 28: ప్రధాని నరేంద్ర మోది సన్నిహిత మిత్రుడిగా పేరొందిన దేశీ శ్రీమంతుడు గౌతమ్ అదానీ వాణిజ్య గ్రూప్పై అమెరికా హెడ్జ్ ఫండ్ హిండెన్బర్గ్ చేసిన తీవ్ర ఆరోపణల దెబ్బ దేశంలోని బ్యాంక్లపై గట్టిగా పడింది. అలాగే అదానీ గ్రూప్లో ఎల్ఐసీ భారీగా చేసిన పెట్టుబడులు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సహా పలు ప్రభుత్వ బ్యాంక్లు ఇచ్చిన రుణాలతో దేశీ ద్రవ్య వ్యవస్థ స్థిరత్వానికి, బ్యాంక్ల్లో కోట్లాది మంది చేసిన పొదుపునకు ముప్పు ఏర్పడిందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
షేర్లను కృత్రిమంగా పెంచివేయడం, విదేశాల్లో డొల్ల కంపెనీలు ఏర్పాటుచేసి వాటి ద్వారా మానీలాండరింగ్కు పాల్పడటం, గ్రూప్ కంపెనీలు ఖాతాల్లో నకిలీ లెక్కలు చూపిస్తున్నదంటూ హిండెన్బర్గ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. అదానీ వ్యాపార సామ్రాజ్యం చాలావరకూ అప్పుల మీద విస్తరించిందే. సొంత మూలధనం కొంతే. ఆయా కంపెనీలు ఆర్జిస్తున్న లాభాలు సైతం అంతంతమాత్రమే. టాటా గ్రూప్ కంపెనీలు ఆర్జించిన తరహాలో క్యాష్ఫ్లో కూడా అదానీ కంపెనీలకు లేదు. అదానీ నిర్వహించే విద్యుత్, విమానాశ్రయాలు, రేవులు, రోడ్లు తదితర మౌలిక సదుపాయాల కంపెనీలకు అవసరమయ్యే పెట్టుబడుల్ని ఆర్జించగలిగేస్థాయిలో ఆ కంపెనీలు లేనందున, వివిధ మార్గాల్లో రుణ సమీకరణల ద్వారానే పలు వ్యాపారాల్ని అదానీ టేకోవర్ చేస్తున్నది.
అదానీ రుణాల్లో అధిక వాటా ఎస్బీఐదే..
మొత్తం అదానీ గ్రూప్ రుణాలు ఏ స్థాయిలో ఉన్నదీ ప్రస్తుతానికి వెల్లడికానప్పటికీ, టాప్-5 గ్రూప్ కంపెనీల అప్పులు రూ.2.1 లక్షల కోట్లని తాజాగా అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ సంస్థ సీఎల్ఎస్ఏ ఒక నివేదిక ఇచ్చింది. ఇందులో దేశీ బ్యాంక్ల నుంచి సమీకరించినవి రూ.81,234 కోట్లని (38 శాతం) సీఎల్ఎస్ఏ తెలిపింది. ఈ రుణాల్లో 10 శాతం ఐసీఐసీఐ, యాక్సిస్ తదితర ప్రైవేటు బ్యాంక్ల నుంచి తీసుకోగా, మిగిలింది ప్రభుత్వ బ్యాంక్ల నుంచే. మూడేండ్లుగా దేశీ బ్యాంక్ల నుంచి అదానీ గ్రూప్ రుణాల్ని పెద్దగా పెంచుకోలేదని, ఇటీవల గ్రూప్ జరిపిన టేకోవర్లు, ప్రారంభించిన కొత్త వ్యాపారాలకు విదేశాల నుంచి రుణాలు సమీకరిస్తున్నదని సీఎల్ఎస్ఏ వివరించింది. మూడేండ్లుగా గ్రూప్ రూ.1 లక్ష కోట్ల రుణాలు సమీకరించగా, ఇందులో బ్యాంక్ల నుంచి తీసుకున్నది రూ.15,000 కోట్ల వరకూ ఉంటుంది.
ఇక మొత్తం రూ.2.1 లక్షల కోట్ల రుణాల్లో బ్యాంక్ రుణాలు 38 శాతంకాగా, బాండ్లు/వాణిజ్యపత్రాలు జారీచేయడం ద్వారా 37 శాతం అదానీ సేకరించింది. మరో 11 శాతం రుణాల్ని ఆర్థిక సంస్థల నుంచి తీసుకోగా, 12-13 శాతం గ్రూప్ కంపెనీల మధ్య పరస్పర రుణాలున్నాయి. అదానీ గ్రూప్నకు ఎంత ఎక్స్ఫోజర్ ఉన్నదీ ఎస్బీఐ వెల్లడించినప్పటికీ, ప్రతీ అవసరానికి ఆ బ్యాంక్ ముంగిట్లోనే అదానీ వాలిపోయేవారని, దీంతో ఎస్బీఐ ఇచ్చిన రుణాలు రూ.50,000 కోట్లపైనే ఉంటాయని పరిశ్రమ నిపుణులు చెపుతున్నారు. అయితే సాధారణ రుణాలు కాకుండా, ప్రభుత్వ రంగ బ్యాంక్లు అదానీ గ్రూప్నకు అందించిన ఇతర ఆర్థిక సహకారాల సమాచారం (గ్యారంటీలు, అండర్రైటింగ్, ఇన్వాయిస్ల డిస్కౌంటింగ్) తమ వద్ద లేదని సీఎల్ఎస్ఏ ప్రకటించింది. ఇటువంటి ఆర్థిక సేవల్ని కూడా అదానీకి అధికభాగం ఎస్బీఐ నుంచే అందాయని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.
కన్నేసి ఉంచాం: బ్యాంక్లు
అదానీ గ్రూప్కు తామిచ్చిన రుణాలు రిజర్వ్బ్యాంక్ నిర్దేశిత పరిమితికి లోబడే ఉన్నాయని, అయినా ఆ గ్రూప్ రుణాల చెల్లింపులపై అప్రమత్తంగా కన్నేసి ఉంచామని దేశీ బ్యాంక్లు తెలిపాయి. అమెరికా హెడ్జ్ ఫండ్ హిండెన్బర్గ్ రీసెర్చ్ అదానీ గ్రూప్ అవకతవకలపై విడుదల నివేదిక విడుదల చేసిన నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ దినేశ్ కుమార్ ఖారా రాయిటర్స్ వార్తా సంస్థ ప్రతినిధితో మాట్లాడుతూ తాము ఆదానీకి ఇచ్చిన రుణాలపై ప్రస్తుతానికి తమకు ఎటువంటి ఆందోళనా లేదన్నారు.
ఈ మధ్యకాలంలో అదానీ గ్రూప్ ఎస్బీఐ నుంచి రుణాలేవీ తీసుకోలేదని, సమీప భవిష్యత్తులో ఆ గ్రూప్ ఎటువంటి నిధుల కోసం వస్తే బ్యాంక్ ‘ఆచితూచి నిర్ణయం’ తీసుకుంటుందని ఖారా వెల్లడించారు. పేరు వెల్లడించడానికి ఇష్టపడని మరో ఎస్బీఐ అధికారి మాట్లాడుతూ హిండెన్బర్గ్ నివేదిక నేపథ్యంలో అదానీ గ్రూప్ వివరణకు ఎస్బీఐ సంప్రదించిందని చెప్పారు. ఆ వివరణ వచ్చిన మీదట అదానీ గ్రూప్ ఎక్స్ఫోజరుపై బ్యాంక్ బోర్డు నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారి ఒకరు మాట్లాడుతూ అదానీ గ్రూప్కు తమ బ్యాంక్ ఇచ్చిన రుణాలు ఆర్బీఐ అనుమతించిన పరిమితిలోనే ఉన్నాయన్నారు.
బ్యాంక్లు వాటి అర్హమైన మూలధనంలో అందుబాటులో ఉన్న నిధుల్లో 25 శాతానికి మించి ఏ ఒక్క గ్రూప్ కంపెనీలకు రుణాలివ్వరాదన్నది ఆర్బీఐ నిబంధన. గత నెలవరకూ అదానీ గ్రూప్ రుణాలపై వడ్డీ చెల్లింపులు సజావుగా ఉన్నాయని బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారి వెల్లడించారు. మరో రెండు ప్రైవేటు బ్యాంక్ల ఎగ్జిక్యూటివ్లు స్పందిస్తూ తామింకా ఆందోళన చెందడం లేదని, ఆ రుణాలపై కన్నేసి ఉంచామన్నారు. ‘వారి (అదానీ కంపెనీలు) నుంచి తాము వివరణ కోసం వేచిచూస్తున్నాం, ప్రతీ బ్యాంకూ అదానీకి ఏ విధమైన నిధులు సమకూర్చాయన్నదాని ఆధారంగా ఆయా బ్యాంక్లు నిర్ణయం తీసుకుంటాయి’ అని ఒక ప్రైవేట్ బ్యాంక్కు చెందిన పేరు తెలపడానికి ఇష్టపడని సీనియర్ ఎగ్జిక్యూటివ్ తెలిపారు.
బ్యాంకింగ్ షేర్లకు భారీ దెబ్బ
హిండన్బర్గ్ తీవ్ర ఆరోపణలు మార్కెట్లో పెను ప్రభావాన్ని చూపించాయి. కేంద్ర బడ్జెట్ సమీపిస్తున్న తరుణంలో కూడా అదానీ గ్రూప్ షేర్లతో పాటు బ్యాంకింగ్ షేర్లు సైతం కుప్పకూలిపోయాయి. గతంలో భారీ కార్పొరేట్ దివాలాలతో ప్రభుత్వ రంగ బ్యాంక్లు, పలు ప్రైవేటు బ్యాంక్లు బ్యాలెన్స్షీట్లు కుంచించుకుపోయిన సంగతి, బ్యాంక్ల వద్ద పేరుకున్న మొండి బకాయిలు ఒక దశలో రూ.14 లక్షల కోట్లకు చేరిన విషయం తెలిసిందే. మొండి బకాయిల్లో చాలావరకూ బ్యాంక్ల లాభాల్లోంచి రైటాఫ్ చేయడం, అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీలకు విక్రయించడం ద్వారా శుద్దిచేసుకున్న బ్యాంక్ ఖాతా పుస్తకాల్ని అదానీ ఉదంతరం మళ్లీ చిందరవందర చేస్తాయన్న భయాలు మార్కెట్లో నెలకొన్నాయి.
దీంతో అదానీ కంపెనీల షేర్ల పతనం చెందిన రీతిలోనే పలు బ్యాంక్ షేర్లు పెద్ద ఎత్తున క్షీణించాయి. అదానీకిచ్చిన భారీ రుణాలు డిఫాల్ట్ అవుతాయన్న భయాలు వ్యాపించడంతో ఇన్వెస్టర్లు బ్యాంకింగ్ షేర్లను ఎడాపెడా విక్రయించారు. హిండెన్బర్గ్ నివేదిక వెలువడిన తర్వాత బ్యాంకింగ్ షేర్ల పతనంతో ఎస్బీఐ రూ.54,000 కోట్ల మార్కెట్ విలువను కోల్పోయింది. కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా తదితర ప్రభుత్వ బ్యాంక్ షేర్లతో పాటు యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ తదితర ప్రైవేటు బ్యాంక్ షేర్లు సైతం భారీగా పతనమయ్యాయి.
అదానీ గ్రూప్పై సమాధానం చెప్పాలి
అదానీ గ్రూప్పై ఇటీవల అంతర్జాతీయ నివేదిక తర్వాత, ఎల్ఐసీ, ఎస్బీఐ, ఇతర కంపెనీల షేర్లలో తగ్గుదల, ఒడిదుడుకులు సర్వత్రా తీవ్రంగా ఆందోళన కలిగిస్తున్నాయని, దీనిపై ప్రతి పౌరుడికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్, సెబీ చీఫ్ మధాబి పూరి బుచ్ దిద్దుబాటు చర్యలు ప్రారంభించేందుకు చొరవ తీసుకోవాలని ఆమె సూచించారు. అలాగే దీని ద్వారా ఆర్థికంగా నష్టపోయిన మిలియన్ల మంది పెట్టుబడిదారులు, వారిపై ఆధారపడిన కుటుంబాలతో ప్రభుత్వం తరఫున మాట్లాడాలని ఆమె ట్వీట్ చేశారు.
ఎల్ఐసీ, ఎస్బీఐని మభ్యపెట్టిందెవరు?
అదానీ గ్రూప్ స్టాక్లలో ఎల్ఐసీ, ఎస్బీఐ సంస్థలు రూ.77 వేల కోట్లు, రూ.80 వేల కోట్లు ఎందుకు పెట్టాయో కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు ట్విట్టర్ వేదికగా శనివారం ప్రశ్నించారు. అదానీ గ్రూప్పై అమెరికాకు చెందిన పెట్టుబడుల పరిశోధనా సంస్థ హిండెన్బర్గ్ నివేదికపై మంత్రి కేటీఆర్ ఈ ప్రశ్నలు సంధించారు. ఎల్ఐసీ, ఎస్బీఐ సంస్థలను అలా నెట్టిందెవరు అంటూ నిలదీశారు. దీనిపై కేంద్రంలోని ఎన్పీఏ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో వారికి ఎవరు సహాయం చేశారని ప్రశ్నలు సంధించారు. ఇవి తీవ్రమైన ప్రశ్నలు అంటూ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.