హైదరాబాద్/హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి/నాగర్కర్నూల్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): టికెట్లు ప్రకటించకముందే గాంధీ భవన్లో టికెట్ల చిచ్చు రేగింది. తమ నేతకు టికెట్ ఇవ్వాలంటూ పలువురు నేతల కార్యకర్తలు ఏకంగా గాంధీభవన్లోనే ధర్నాలు చేస్తున్నారు. మంగళవారం నాగర్కర్నూల్ నేత నాగం జనార్దన్రెడ్డి అనుచరులు గాంధీ భవన్లో వీరంగం సృష్టించారు. నాగర్ కర్నూల్ టికెట్ను తమ నేతకే కేటాయించాలని డిమాండ్ చేశారు. అక్కడ కొత్తగా పార్టీలో చేరిన కూచుకుళ్ల రాజేశ్రెడ్డికి టికెట్ ఇస్తే సహించేది లేదని హెచ్చరించారు. అప్పుడే పీఏసీ సమావేవానికి వస్తున్న రేవంత్రెడ్డిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ను నమ్ముకొని నాగం పని చేస్తుంటే, కాంగ్రెస్ను గాలికి వదిలేసి మళ్లీ పార్టీలోకి వచ్చే నాయకులకు టికెట్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. అదే విధంగా ఎస్టీ వర్గం నేతలు కూడా గాంధీ భవన్లో ధర్నాకు దిగారు. పార్టీలో ఎస్టీ వర్గానికి చెందిన నేతలు చాలా మంది ఉన్నారని, తమకు తగినన్ని సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇందులో భాగంగానే ఎస్టీ రిజర్వు స్థానాలే కాకుండా జనరల్ స్థానాల్లోనూ తమకు సీట్లు కేటాయించాలని నినాదాలు చేశారు. ఇక గోషామహల్ నేతలు కూడా గాంధీభవన్లో ధర్నాకు దిగారు. గోషామహల్ టికెట్ను స్థానికులకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇక్కడ ఆ పార్టీ నేత మెట్టు సాయి పోటీలో ఉన్నారు. అయితే ఈ స్థానానికి మహిళా కాంగ్రెస్ నేత సునీతారావు పోటీ పడుతున్నారు. దీంతో అక్కడ టికెట్ కోసం కొట్లాట మొదలైంది. గాంధీ భవన్ వేదికగా పార్టీనేతలు ధర్నాలు చేస్తుండటం గమనార్హం. ఓ దశలో రేవంత్ జోక్యం చేసుకొని ‘గాంధీ భవన్లో ధర్నా చేస్తే సస్పెండ్ చేస్తా’ అంటూ హెచ్చరించారు. రేవంత్ హెచ్చరికలను ఎవరూ ఖాతరు చేయకపోవడం గమనార్హం. మళ్లీ యథావిధిగానే గాంధీ భవన్ ధర్నా చౌక్గా మారిపోయింది.
రేవంత్ వర్సెస్ కోమటిరెడ్డి
ఇబ్రహీంపట్నం టికెట్ ప్రస్తుతం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ వర్సెస్ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మధ్య చిచ్చు పెట్టింది. మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి టికెట్ ఇప్పించేందుకు రేవంత్ పావులు కదుపుతుండగా.. తన పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోకి వచ్చే నియోజకవర్గంలో నీ పెత్తనం ఏమిదంటూ కోమటిరెడ్డి ఫైర్ అవుతున్నట్టు తెలిసింది. ఈ క్రమంలో ఇటీవల ఢిల్లీ వేదికగా ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకున్నట్టు తెలిసింది. క్షేత్రస్థాయిలో ఓవైపు మల్రెడ్డి టికెట్ తనదేనంటూ ప్రచారం చేసుకుంటుండగా.. కోమటిరెడ్డి సూచనతో మరో నేత మర్రి నిరంజన్రెడ్డి కూడా తనదే టికెట్ అంటూ ప్రచారం చేసుకుంటున్నారు.
తగ్గేదేలే అంటున్న సుంకిరెడ్డి వర్గం
ప్యారాచూట్ నేత కసిరెడ్డి నారాయణరెడ్డికి కల్వకుర్తి టికెట్ ఇస్తే ఊరుకునేది లేదంటూ సుంకిరెడ్డి రాఘవేందర్రెడ్డి వర్గం హెచ్చరిస్తున్నది. ఇప్పటికే ఆమనగల్లు, కడ్తాల్, మాడ్గుల, కల్వకుర్తి మండలాల నేతలు, కార్యకర్తలు వరుస సమావేశాలు ఏర్పాటు చేసి కసిరెడ్డికి వ్యతిరేకగళం వినిపించారు. కసిరెడ్డికి టికెట్ ఇప్పించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్రెడ్డి మంగళవారం ఆమనగల్లు పరిధిలోని ఒక ఫంక్షన్ హాల్లో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దీనిని సుంకిరెడ్డితోపాటు నియోజకవర్గానికి చెందిన నేతలు బహిష్కరించారు. ఇదే సమయంలో తలకొండపల్లి కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. కసిరెడ్డికి టికెట్ ఇస్తే పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తామని తీర్మానించినట్టు సమాచారం. సర్వేలు, దరఖాస్తులు అంటూ ప్యారాచూట్ నేతకు టికెట్ ఎలా ఇస్తారంటూ ప్రశ్నించారు.