వరంగల్ : బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు వరంగల్లో ఓటరు జాబితా సవరణ ( Voter List Revision) ప్రక్రియలో చురుకుగా పాల్గొనాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR ) పిలుపునిచ్చారు. మంగళవారం ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నేతలతో సమావేశంలో ఆయన మాట్లాడారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించేందుకు కృషి చేయాలని సూచించారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో పార్టీ సభ్యత్వ నమోదు, ప్రతి గ్రామం , వార్డులో బీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని నాయకులకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. త్వరలో జరగనున్న వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సందర్భంగా విస్తృతంగా చర్చించారు. ఉమ్మడి జిల్లాలోని ప్రతి నియోజకవర్గం వారీగా పార్టీ స్థితిగతులపై ఆయన సమీక్షించారు. ఈ సమావేశంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్, మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు పాల్గొన్నారు.