జడ్చర్లటౌన్, మే 17 : ప్రేమించలేదని యువతిని కత్తితో గొంతుకోసి హత్య చేయగా.. స్థానికుల దాడిలో తీవ్రంగా గాయపడిన ప్రేమోన్మాది దవాఖానలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. వివరాలు ఇలా.. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలోని నిమ్మబావిగడ్డ ప్రాంతంలో నివాసముంటున్న వైష్ణవి(24)ని ఓ యువకుడు కత్తితో హత్యచేసి పారిపోతున్న క్రమంలో స్థానికులు పట్టుకొని చితకబాదారు. తీవ్రంగా గాయపడిన యువకుడిని చికిత్స నిమిత్తం జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు.
యువతిని హత్య చేసిన యువకుడు హైదరాబాద్లోని ఉప్పల్కు చెందిన మణితేజ(29)గా గుర్తించారు. లాండ్రీ షాపు నిర్వహిస్తున్న మణితేజ కొన్నాళ్లుగా జడ్చర్లకు చెందిన వైష్ణవిని ప్రేమపేరుతో వేధిస్తుండగా, సదరు యువతి తిరస్కరించినట్టు సమాచారం. వైష్ణవికి మరొకరితో పెండ్లి సంబంధం కుదిరిన విషయం తెలుసుకున్న మణితేజ మరింత కక్ష పెంచుకొని శనివారం సాయంత్రం జడ్చర్లలోని నిమ్మబావిగడ్డ ప్రాంతంలో ఒంటరిగా ఇంటికి వెళ్తున్న వైష్ణవిని అడ్డగించి హత్య చేశాడు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నారు.