మంత్రి హత్యకు కుట్ర కేసులో 2వ రోజు విచారణ
ఒక్కొక్కరిని విడివిడిగా ప్రశ్నిస్తున్న పోలీసులు
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 10: మంత్రి శ్రీనివాస్గౌడ్ హత్యకు కుట్ర పన్నిన కేసులోని నిందితులు పోలీసులు అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇవ్వకుండా, మౌనంగా ఉన్నట్టు తెలుస్తున్నది. చర్లపల్లి జైల్లో ఉన్న ఏడుగురు నిందితులను తమ కస్టడీకి తీసుకొన్న సైబరాబాద్ పోలీసులు రెండోరోజు విచారణ కొనసాగించారు. గురువారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఒక్కొక్కరిని విడివిడిగా ప్రశ్నించారు. మున్నూరు రవితో పాటు మరో ఇద్దరిని 5 గంటల పాటు విచారించారు. తుపాకులను ఎక్కడి నుంచి సేకరించారు? ఎలా తీసుకొచ్చారు? వీటి కొనుగోలుకు డబ్బులు ఎవరు ఇచ్చారు? వంటి ప్రశ్నలకు నిందితులు జవాబివ్వకుండా మౌనంగా ఉన్నట్టు సమాచారం. కుట్రలో ఎవరెవరి పాత్ర ఉన్నదనే కోణంలో పోలీసులు ఆరా తీసినప్పటికీ, నిందితుల నుంచి సమాధానం రాలేదని తెలుస్తున్నది. ఇప్పటివరకు నలుగురిని ప్రశ్నించిన పోలీసులు శుక్రవారం మరికొందరిని ప్రశ్నించనున్నారు. చివరగా రాఘవేంద్రరాజును విచారించనున్నారు. విడివిడి విచారణ పూర్తయిన తరువాత నిందితులందరీని ఒకే దగ్గర కూర్చోబెట్టి ప్రశ్నించనున్నట్టు తెలుస్తున్నది. దీంతో కుట్ర కేసులో సస్పెన్స్ వీడిపోతుందని పోలీసు అధికారులు భావిస్తున్నారు. పోలీసు కస్టడీలో రాఘవేంద్రరాజు, మధుసూదన్రాజు, అమరేందర్రాజు, నాగరాజు, విశ్వనాథ్, యాదయ్య, మున్నూరు రవి ఉన్న విషయం తెలిసిందే.