హైదరాబాద్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం 2021-22 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణకు రూ.29,554 కోట్ల నిధులు ఇచ్చినట్టు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల కోసం రాష్ర్టాలకు ఎన్ని నిధులు మంజూరు చేశారని తమిళనాడు రాష్ట్రం సేలం పార్లమెంట్ సభ్యుడు ఎస్ఆర్ పార్థిబన్ లోక్సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమాధానం ఇచ్చారు.
2017-18వ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తెలంగాణకు కేంద్రం రూ.15,949 కోట్లు ఇచ్చినట్టు వెల్లడించారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.29,554 కోట్లు మంజూరు చేసినట్టు ప్రకటించారు. జీఎస్టీ వాటా కింద 2017-18వ ఆర్థిక సంవత్సరానికిగాను రూ.231 కోట్లు, 2021-22 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.5,572 కోట్లు ఇచ్చినట్టు వివరించారు.