హైదరాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగా ణ): తెలంగాణ రాష్ట్రం ఏర్పడేనాటికి రూ.72,658 కోట్లుగా ఉన్న రాష్ట్ర రుణాలు, ఇప్పుడు 6,71,757 కోట్లకు పెరిగినట్టు ప్రభుత్వం తెలిపింది. ఆర్థిక పరిస్థితులపై బుధవారం అసెంబ్లీలో శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. తెలంగాణ ఆర్థిక రంగం బలమైన పునాదులతో ప్రారంభమైందని పేర్కొన్నది. మొద టి ఐదేండ్లలో రెవెన్యూ మిగులుతోపాటు ఆర్థిక బాధ్యత, బడ్జెట్ నిర్వహణ నిబంధలను నాటి ప్రభుత్వం పాటించిందని అభినందించింది. ఆ తర్వా త పలు భారీ సాగునీటి ప్రాజెక్టులకు స్పెషల్ పర్పస్ వెహికిల్ (ఎస్పీవీ)లు సృష్టించి, బడ్జెట్ వెలుపల రుణాలు తీసుకోవడం ప్రారంభించిన తర్వాత ఇ బ్బందులు మొదలయ్యాయయని పేర్కొన్నది. ఎస్పీవీలకు రాబడులు లేకపోవడంతో ఆ రుణాల చెల్లిం పు రాష్ట్ర ప్రభుత్వమే చేస్తున్నదని చెప్పింది. రాష్ట్ర ఆదాయం 4 రెట్లకుపైగా పెరుగగా, రెవెన్యూ మిగులు 13 రెట్లు పెరిగినట్టు గణాంకాలు చెప్తున్నాయి. ద్రవ్యలోటు ఎఫ్ఆర్బీఎం పరిమితికి లోబడే ఉన్నదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
రాష్ట్రం ఆవిర్భావం నాటికి రుణాలు 72,658 కోట్లు ఉంటే.. ఈ ఏడాదికి బడ్జెట్ అంచనాల ప్రకారం 3,89,673 కోట్లకు పెరిగినట్టు శ్వేతపత్రం లో పేర్కొన్నారు. 2014-23 మధ్య సగటున 24.5 శాతం చొప్పున రుణాలు పెరిగినట్టు ప్రభుత్వం వెల్లడించింది. 2015-15లో రాష్ట్ర రుణ-జీఎస్డీపీ నిష్ప త్తి 15.7 శాతంగా ఉండగా, ఈ ఆర్థిక సంవత్సరానికి 27.8 శాతానికి పెరిగిందని పేర్కొన్నది. ప్రభుత్వ హామీతో 17 స్పెషల్ పర్పస్ వెహికిల్స్ (ఎస్పీవీ) ఏ ర్పాటు చేసి రూ.1,85,029 కోట్లు సేకరించినట్టు వెల్లడించింది. ప్రభుత్వం హామీలేని రుణాలు కూడా కలుపుకొంటే మొత్తంగా రాష్ట్ర రుణాలు 6,71,757 కోట్లకు పెరిగినట్టు తెలిపింది. మరోవైపు అసలు, వడ్డీల చెల్లింపుల భారం ప్రభుత్వంపై ప్రతి సంవత్సరం పెరుగుతున్నట్టు చెప్పింది. 2014-15లో అసలు, వడ్డీ చెల్లింపులు రూ.7,255 కోట్లుగా ఉన్నాయని, 2023-24 నాటికి రూ.53,978 కోట్లకు చేరాయని వివరించింది. గతంలో మొత్తం ఆదాయంలో చెల్లింపులకు 14 శాతం పోగా, ఇప్పుడు 34 శాతానికి పెరిగినట్టు తెలిపింది.
2014-15లో రాష్ట్రంలో 369 కోట్ల రెవెన్యూ మిగులు ఉండగా, ఈ ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ అంచనాల ప్రకారం 4,882 కోట్లు మిగులు ఉన్నట్టు శ్వేతపత్రంలో ప్రభుత్వం వెల్లడించారు. అంటే సుమారు 13 రెట్లు పెరిగింది. కరోనా ఇబ్బంది పెట్టిన రెండుమూడేండ్లు తప్ప మిగతా అన్ని సంవత్సరాలు మిగులు ఉన్నట్టు స్పష్టం చేశారు. ఎఫ్ఆర్బీఎం నిబంధనల ప్రకారం ద్రవ్యలోటు జీఎస్డీపీతో పోల్చితే అదుపులోనే ఉన్నట్టు నివేదిక తెలిపింది. 2014-15లో జీఎస్డీపీలో 1.9% ద్రవ్యలోటు ఉండగా, 2023-24 నాటికి 2.7 శాతానికి పెరిగిందని తెలిపింది. ఎఫ్ఆర్బీఎం నిబంధనలు 3%లోపే ఉండాలని సూచిస్తున్నాయని చెప్పింది.
రాష్ట్రంపై దాదాపు రూ.7 లక్షల కోట్ల అప్పుల భారం ఉన్నదని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో ఆర్థిక విధ్వంసం, అరాచకత్వం జరిగిందని తీవ్రస్థాయిలో ఆరోపించారు. బుధవారం అసెంబ్లీలో ఆర్థిక పరిస్థితిపై నిర్వహించిన చర్చకు సమాధానంగా భట్టి మాట్లాడుతూ.. బడ్జెట్లో చేసిన అప్పులకు ప్రభుత్వం ఏటా రూ.53 వేల కోట్ల వడ్డీ చెల్లించాల్సిన దుస్థితికి రాష్ర్టాన్ని తెచ్చారని మండిపడ్డారు. తెలంగాణ అప్పు రూ. 5 లక్షల కోట్లు అనే ఇన్నాళ్లు అనుకున్నామని పేర్కొన్నారు. ఈ అప్పును గత ప్రభుత్వం రూ. 7 లక్షల కోట్లకు పెంచి దానిని బయటపెట్టకుండా దాచిపెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేందుకు ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తుందని భట్టి పేర్కొన్నారు. మిషన్ భగీరథపై సమగ్ర విచారణ జరిపించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తానని పేర్కొన్నారు. శ్వేతపత్రాన్ని ఆంధ్రప్రదేశ్ రిటైర్డ్ అధికారితో తయారుచేయించారంటూ హరీశ్రావు చేసిన విమర్శలపై మాట్లాడుతూ.. ఆయన వ్యాఖ్యలు తెలంగాణ అధికారులను అవమానించేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ విధానాలతో రాష్ట్రంలో ఆర్థిక అసమానతలు పెరిగాయని పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో ప్రజలకు భ్రమలు కల్పించారని తెలిపారు. ఇందిరమ్మ రాజ్యంలో స్వేచ్ఛగా, హాయిగా బతకొచ్చని భట్టి పేర్కొన్నారు.
తెలంగాణలో గత తొమ్మిదిన్నరేండ్లలో రెవెన్యూ రాబడులు నాలుగు రెట్లకుపైగా పెరిగినట్టు శ్వేతపత్రంలో ప్రభుత్వం ప్రకటించింది. 2014-15లో రూ.51,042 కోట్లు ఉండగా, 2023-24 నాటికి రూ.2,16,567 కోట్లకు పెరిగినట్టు చెప్పింది. అయితే వృద్ధిరేటులో మాత్రం అస్థిరత కొనసాగినట్టు తెలిపింది. 2015-16లో 49.16 శాతం వృద్ధిరేటు ఉండగా, 2023-24 నాటికి 35.91 శాతంగా ఉన్నదని వెల్లడించింది. జీఎస్డీపీతో పోల్చితే రెవెన్యూ ఆదాయం 2014-15లో 10.1 శాతం ఉండగా, ఇప్పుడు 15.3 శాతానికి పెరిగిందని పేర్కొన్నది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఇతర 18 రాష్ర్టాల జీఎస్డీపీతో రెవెన్యూ రాబడులు పోల్చితే తెలంగాణ 13వ స్థానంలో ఉన్నట్టు పేర్కొన్నది.
2014లో రూ.1,00,638 కోట్లతో ప్రారంభమైన రాష్ట్ర బడ్జెట్ అంచనాలు, 2022-23 నాటికి రూ.2,04,085 కోట్లకు చేరాయని ప్రభుత్వం పేర్కొన్నది. అయితే అంచనాలకు, వాస్తవ వ్యయానికి భారీగా వ్యత్యాసం ఉన్నట్టు తెలిపింది. సగటున 82.3 శాతంగా మాత్రమే ఉన్నట్టు వెల్లడించింది. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వ వాస్తవ వ్యయం 102.9 శాతంగా ఉన్నట్టు పేర్కొన్నది. ఉమ్మడి రాష్ట్రంలో 2004-2014 మధ్య సగటున 87 శాతం వాస్తవ వ్యయం ఉన్నట్టు నివేదిక తెలిపింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో వాస్తవ వ్యయం విషయంలో రాజస్థాన్ 116.4 శాతంతో దేశంలోనే అగ్రస్థానంలో ఉండగా, కర్ణాటక 113.1 శాతం, మధ్యప్రదేశ్ 110.6 శాతం, కేరళ 100.7 శాతం, మహారాష్ట్ర 99.3 శాతంతో టాప్-5 రాష్ర్టాలుగా ఉన్నాయి. తెలంగాణ 79.3 శాతంతో 17వ స్థానంలో నిలిచింది. 18 రాష్ర్టాల్లో తెలంగాణ కింది నుంచి రెండో స్థానంలో ఉన్నట్టు నివేదిక తెలిపింది.