కరీంనగర్ రూరల్/కరీంనగర్ కలెక్టరేట్/ గజ్వేల్, మార్చి 7: కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన గజ్వేల్ తహసీల్దార్ కమటం శ్రవణ్కుమార్ ఇంట్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారని వచ్చిన ఫిర్యాదు మేరకు నగరంలోని ఆయన ఇంటితోపాటు మరో రెండు చోట్ల ఏకకాలంలో దాడులు చేసి, రూ.4కోట్ల విలువైన ఆస్తులు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన శ్రవణ్కుమార్ గతంలో కరీంనగర్ రెవెన్యూ కార్యాలయంలో ఆర్ఐగా పనిచేసి బదిలీపై డిప్యూటీ తహసీల్దార్గా వెళ్లారు. ప్రమోషన్పై 2021 నుంచి ఆగస్టు 2023 వరకు కరీంనగర్ రెవెన్యూ కార్యాలయంలో పనిచేశారు.
ఎన్నికల సమయంలో బదిలీపై సిద్దిపేట జిల్లా గజ్వేల్ తహసీల్దార్గా వెళ్లి అక్కడే విధులు నిర్వర్తిస్తున్నారు. తహసీల్దార్పై అవినీతి ఆరోపణల నేపథ్యంలో శనివారం ఉదయం నగరంలోని మహారాజా బార్ రెస్టారెంట్ వెనుక ఉన్న ఆయన ఇంటితోపాటు ఆర్టీసీ కాలనీలో రెండు చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. రెండు ఇండ్లు, ఆరు ఫ్లాట్లతో కూడిన అపార్ట్మెంట్, రూ.2,47,33,540 విలువ చేసే నాలుగు వాహనాలు, రూ.1.60 లక్షల విలువైన ద్విచక్ర వాహనం, రూ.30 లక్షల విలువైన ఫోర్ వీలర్, రూ.4.20 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రూ.15.66 లక్షల విలువైన గృహోపకరణాలు, రూ.11.90 లక్షల నగదు ఏసీబీ తనిఖీల్లో పట్టుబడింది. శ్రవణ్కుమార్ను అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్కు తరలిస్తున్నట్టు ఏసీబీ అధికారులు తెలిపారు. ప్రభుత్వ శాఖలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు లంచం అడిగితే 1064, 9440446106 నంబర్లకు, twitter @telangana ACB ద్వారా బాధితులు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.