వనపర్తి : ఓ అవినీతి అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు (ACB Raids) రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. భూమికి సంబంధించిన విషయంలో లంచం డిమాండ్ చేయగా బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుకు స్పందించి వలవేసి రెవెన్యూ అధికారిని పట్టుకున్నారు. వివరాలు .. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం తహసీల్ కార్యాలయంలో అడిషనల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్(ARI) గా పనిచేస్తున్న అస్కాని నర్సింలు శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు కార్యాలయంలో రూ. 5 వేలు లంచంb (Bribe) తీసుకుంటుండగా పట్టుకున్నారు.
మండల కేంద్రం గాంధీనగర్ కాలనీకి చెందిన జానకి రాములు అనే బాధితుడు తన తాతల పేరుమీద ఉన్న భూమిని వారసులమైన తమ పేరుమీదకు పట్టా మార్చి ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నాడు. అయితే ఏఆర్వో లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. శుక్రవారం ఏసీబీ అధికారులు (ACB Officers) వ్యూహం ప్రకారం మాటువేసి ఏఆర్వో లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
అవినీతికి పాల్పడిన ఏఆర్వోపై కేసు నమోదు చేసి కోర్టు ఎదుట హాజరు పరిచామని ఏసీబీ డీజీ తెలిపారు. దర్యాప్తు కొనసాగుతుందని వెల్లడించారు. పబ్లిక్ సర్వెంట్లు ఎవరైనా లంచం అవినీతి,అక్రమాలకు పాల్పడితే ఏసీబీని సంప్రదించాలని ఆయన కోరారు.