అంతర్గాం/బోథ్, ఏప్రిల్ 9 : ప్రభుత్వ కార్యాలయాల్లో గురువారం ఏసీబీ అధికారులు దాడులు చేసి పలువురు అధికారులను పట్టుకున్నారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం రాయదండికి చెందిన రైతు వెంకటస్వామి.. తన ఐదెకరాల భూమి ఇతరుల పేరుమీద ధరణిలో నమోదు కావడంతో దీనిపై విచారణ జరిపించాలని 6 నెలల క్రితం అంతర్గాం ఆర్ఐ శ్రీమాన్ను సంప్రదించాడు. ఆర్ఐ రూ.10వేల లంచం అడగడంతో రైతు ఏసీబీని ఆశ్రయించాడు. అంతర్గాం తహసీల్ ఆఫీస్లో రైతు వెంకటస్వామి నుంచి రూ.10వేలు తీసుకుంటున్న క్రమంలో ఆర్ఐని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
విచారణ అనంతరం ఆర్ఐపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్టు ఏసీబీ డీఎస్పీ విజయ్కుమార్ తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ అటవీ రేంజ్ కార్యాలయంలో లంచం తీసుకుంటూ రేంజ్ అధికారి ప్రణయ్, జూనియర్ అసిస్టెంట్ పరశురాం పట్టుబడ్డారని ఏసీబీ ఆదిలాబాద్ డీఎస్పీ మధు వెల్లడించారు. ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కింద హరితహారంలో భాగంగా నాటిన మొక్కల బిల్లు రూ.5.09 లక్షలు ఇచ్చేందుకు ఎఫ్ఆర్వో, జూనియర్ అసిస్టెంట్ బాధితుడిని లంచం అడిగారు. సదరు బాధితుడు రూ.15 వేలు లంచం ఇస్తుండగా అధికారులు ఎఫ్ఆర్వోతోపాటు జూనియర్ అసిస్టెంట్ను అదుపులోకి తీసుకున్నారు.