హైదరాబాద్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్, రెరా సెక్రటరీ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో తమ విచారణ ప్రాథమిక నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి ఏసీబీ అధికారులు సమర్పించారు. అక్రమాస్తుల కేసులో బాలకృష్ణను అరెస్టు చేసిన ఏసీబీ… ఎనిమిది రోజులపాటు కస్టడీకి తీసుకొని అన్ని కోణాల్లోనూ విచారించింది. కస్టడీలో బాలకృష్ణ ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ ప్రకారం.. ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి పాత్రపై కూడా ఏసీబీ ఉన్నతాధికారులు ప్రభుత్వానికి నివేదించినట్టు తెలిసింది. ఆ అధికారిని కూడా విచారించేందుకు ప్రభుత్వ అనుమతి సైతం కోరినట్టు సమాచారం. వారిద్దరి మధ్య సఖ్యతతో ఎన్నో అక్రమాలు జరిగాయని నివేదించారు. సదరు ఐఏఎస్ అధికారిని తప్పనిసరిగా విచారించాల్సిందేనని ఏసీబీ పట్టబట్టునట్టు సమాచారం.
ప్రభుత్వ అనుమతి కోసం ఏసీబీ అధికారులు ఎదురుచూస్తున్నారు. నార్సింగిలోని 12 ఎకరాల భూమి అనుమతులపై ఆ ఐఏఎస్ అధికారిని ప్రశ్నిస్తే.. మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని ఏసీబీ భావిస్తున్నది. బాలకృష్ణ 8 ఏండ్లలో 15 సెల్ఫోన్లు, తొమ్మిది ల్యాప్టాప్లు మార్చినట్టు ఏసీబీ గుర్తించింది. బాలకృష్ణతోపాటు అతడి కుటుంబసభ్యుల నుంచి ఫోన్లు, 30కిపైగా డిజిటల్ సామగ్రి స్వాధీనం చేసుకున్నట్టు ఏబీసీ తెలిపింది. శివబాలకృష్ణ ఫోన్లలోని సమాచారం, అతని బంధువుల ఫోన్లలోని సమాచారాన్ని రిట్రివ్ చేస్తున్నారు. ఇప్పటికే సేకరించిన కాల్ డాటా రికార్డు (సీడీఆర్)ను పరిశీలిస్తున్నారు. మొత్తానికి శివబాలకృష్ణ వ్యవహారంలో ఆ సీనియర్ ఐఏఎస్కు నలువైపులా ఉచ్చు బిగుస్తున్నది.
అన్నయ్య అక్రమాస్తుల వ్యవహారంలో తమ్ముడు శివ నవీన్కుమార్ అత్యంత కీలకంగా వ్యవహరించినట్టు ఏసీబీ వర్గాలు తెలిపాయి. అతడిని సోమవారం ఏసీబీ అధికారులు తమ కస్టడీకి కోరే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. శివబాలకృష్ణకు బినామీలుగా ఉన్న అతడి మేనల్లుడు భరత్, మరదలను కూడా అరెస్టు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఏసీబీ అరెస్టుచేసిన శివ బాలకృష్ణ సోదరుడు శివ నవీన్కుమార్ మొదటి నుంచి ఎవరి దగ్గర ఎంత మొత్తం తీసుకోవాలి? వాటిని ఎకడికి మళ్లించాలి? ఎకడ పెట్టుబడులు పెట్టాలి? అనే వ్యవహారాలు చూస్తున్నాడు. అక్రమంగా వచ్చే నిధులను దారి మళ్లించేందుకు నవీన్కుమార్ రెండు డొల్ల కంపెనీలను ఏర్పాటుచేసినట్టు ఏసీబీ అధికారులు పూర్తి ఆధారాలను సేకరించారు. వాటికి ఆదాయ పన్ను (ఐటీ) సైతం చెల్లించినట్టు గుర్తించారు. డొల్ల కంపెనీల్లోని పలువురు ఉద్యోగులను సైతం విచారించారని సమాచారం.