ఇల్లంతకుంట, ఏప్రిల్ 16: రైతు భూమి కొలిచేందుకు రూ.4 వేలు లంచం తీసుకొం టూ డిప్యూటీ సర్వేయర్, ప్రైవేట్ అసిస్టెంట్ ఏసీబీకి చిక్కారు. ఏసీబీ డీఎస్పీ భద్రయ్య కథనం ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంటకు చెందిన రైతు రేగుల శంకర్కు ఆరు ఎకరాల భూమి ఉన్నది. మోఖా మీద తక్కువగా ఉండటంతో రెవెన్యూ అధికారులను సంప్రదించారు. వారి సూచన మేరకు జనవరి 18న జిల్లా కేంద్రంలోని సర్వే అధికారి కార్యాలయానికి వెళ్లి డిప్యూటీ సర్వేయర్ రమణయ్య ను కలిశారు.
రూ.5 వేలు లంచం తీసుకొని చుట్టుపక్కల రైతులకు నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకొన్నారు. సమస్య పరిష్కారం కాకపోవడంతో రైతు మళ్లీ డిప్యూటీ సర్వేయర్ను కలువగా.. మరో రూ.5 వేలు డిమాండ్ చేశాడు. శనివారం మధ్యాహ్నం తన ప్రైవేట్ అసిస్టెంట్ తోటపెల్లి శేఖర్తో కలిసి రమణయ్య భూమి కొలిచాడు. రైతు రూ.4 వేలు ఇస్తుండగా, ఏసీబీ అధికారులు రమణయ్యను, శేఖర్ను పట్టుకొన్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి ఆదివారం ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ డీఎస్పీ భద్రయ్య తెలిపారు.