ACB | శామీర్పేట/రాంనగర్, ఫిబ్రవరి 13: పది లక్షలు లంచం తీసుకుంటూ శామీర్పేట తాసీల్దార్ తోడేటి సత్యనారాయణ మంగళవారం ఏసీబీ అధికారులకు చిక్కాడు. అధికారుల వివరాల ప్రకారం.. ఏపీలోని గుంటూరు జిల్లా నిడుబ్రోలు మున్సిపాలిటీకి చెందిన మువ్వ రామశేషగిరిరావు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్పేట మండలం లాల్గడి మలక్పేట గ్రామంలోని సర్వే నెంబర్ 129 నుంచి 137 వరకు 29 ఎకరాల భూమిని 2006లో కొనుగోలు చేశారు. ఆ భూమికి 2013లో పాస్బుక్స్ వచ్చాయి. కానీ, కొత్త పాస్బుక్, రికార్డుల నిర్వహణ కోసం ధరణిలో ఆర్జి పెట్టుకున్న శేషగిరిరావు తాసీల్దార్ను ఆశ్రయించారు.
రికార్డు విషయమై తాసీల్దార్ సత్యనారాయణతో శేషగిరిరావుకు రూ.30 లక్షలకు బేరం కుదిరింది. తొలుత తాసీల్దార్కు నగరంలోని ఓ హోటల్లో రూ.10 లక్షలను కొన్ని నెలల క్రితం శేషగిరిరావు ఇచ్చారు. షూరిటీ కోసం రూ.20 లక్షల చెక్కును తాసీల్దార్కు అందజేశారు. అయినా పని జరుగకపోవడంతో రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. మంగళవారం తాసీల్దార్ కార్యాలయానికి శేషగిరిరావు రూ.10 లక్షలు తీసుకుని వచ్చారు. సార్.. డబ్బులు తెచ్చాను! అని చెప్పగానే తన డ్రైవర్కు ఇవ్వమని తాసీల్దార్ సూచించాడు. డ్రైవర్కు నగదు అందగానే డబ్బులు ఇచ్చాడు సార్ అని కన్ఫామ్ చేసుకున్నాడు. ఈ తంతును గమనిస్తూ ఆధారాలు సేకరిస్తున్న ఏసీబీ అధికారులు తాసీల్దార్ సత్యనారాయణతోపాటు డ్రైవర్ బద్రిని అదుపులోకి తీసుకున్నారు.
నగదుతోపాటు కార్యాలయంలోని రికార్డులు, కారులో నుంచి రూ.20 లక్షల చెక్కు, రెండు ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. తాసీల్దార్ కార్యాలయంతోపాటు ఆయన ఇంటి వద్ద, స్వగ్రామం కరీంనగర్లోని హిందూపురి కాలనీలోని అతడి నివాసం, బంధువుల నివాసాల్లో ఏక కాలంలో దాడులు చేపట్టారు. పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని పూడూర్ ప్రాథమిక పాఠశాలలో టీచర్గా పనిచేస్తున్న తాసీల్దార్ భార్య రేణుకను కూడా విచారించారు. దాడుల్లో ఏసీబీ డీఎస్పీ మాజీద్ అలీఖాన్, ఇన్స్పెక్టర్లు మల్లికార్జున్, సురేందర్భట్, సిబ్బంది పాల్గొన్నారు.