నిర్మల్ జిల్లా ముథోల్లో 13.28 సెం.మీ.
రాష్ట్రమంతటా నైరుతి రుతుపవనాలు
ఆదివారం వరకు పలుజిల్లాల్లో భారీవర్షాలు
హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ): నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతా విస్తరించడంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో వానలు పడ్డాయి. 22 జిల్లాలో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. గురువారం నిర్మల్ జిల్లా ముథోల్లో అత్యధికంగా 13.28 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ నెల 13న రాష్ట్రంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు.. మూడు రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాయి. రుతుపవనాల ప్రభావం తీవ్రంగా ఉన్నందున శుక్ర, శని, ఆదివారాల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆయా జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక జారీ చేసింది. రుతుపవనాల ఉత్తర పరిమితి గురువారం పోరుబందర్, భావ్నగర్, ఖండ్వా, గొండియా, దుర్గ్, భవానీపట్నం, కళింగపట్నం గుండా వెళ్తున్నదని తెలిపింది. ఉపరితల ద్రోణి విదర్భ నుంచి తెలంగాణ మీదుగా రాయలసీమ వరకు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద కొనసాగుతున్నట్టు పేర్కొన్నది.
మూడు రోజులకు భారీ వర్షాల హెచ్చరిక