కరీంనగర్: ఏడాది కింద కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెచ్చిన మూడు రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించడం హర్షణీయమని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ అన్నారు. కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ..కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు.
సీఎం కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు హైదరాబాద్లో చేసిన ధర్నాతో కేంద్రానికి కనువిప్పు కలిగిందన్నారు. ఈ చట్టాలను రద్దు చేయాలని టీఆర్ఎస్ మొదటి నుంచి చెబుతోంది. ఏడాది కాలంగా ఢిల్లీలో రైతులు ఆందోళన చేస్తున్నారు. దాదాపు 1200 మంది మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు.
బీజేపీ నాయకులు రైతులపై కార్లు ఎక్కించి చంపారు. ఈ పరణామాలతో బీజేపీ హఠావో.. దేశ్ కు బచావో నినాదం దేశమంతా మార్మోగుతోందన్నారు. కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ లో మహా ధర్నా జరుగుతున్నపుడే యాసంగి వడ్లు కొనమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కానీ రాష్ట్రంలోని బీజేపీ నాయకులు నిన్నటి వరకు వరి నాట్లు వేయిస్తాం అన్నారు.
కేసీఆర్ మెడలు వంచి వడ్లు కొనిపిస్తామని ఇక్కడి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. ఇపుడు ఎవరి మెడలు వంచాలి అని వినోద్ కుమార్ సూటిగా ప్రశ్నించారు. నిన్నటి వరకు వరి, వడ్లు అంటూ ఊళ్లలో తిరిగి రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేసిన బండి సంజయ్ మల్లా రేపటి నుంచి పెట్రోల్ ధరలపై నిరసనలు వ్యక్తం చేస్తామంటున్నాడు. అసలు కేంద్రంలో ఉన్న బీజేపీతో బండి సంజయ్ కి సంబంధం ఉందా లేదా అని ప్రశ్నించారు.
రాష్ట్రంలో బండిది వేరే బీజేపీ పార్టీనా అనేది అర్థం కావడం లేదన్నారు. పెట్రోల్ ధరలు పెంచింది కేంద్ర ప్రభుత్వం. పన్నుల కంటే అధికంగా సెస్సులు వసూలు చేస్తోంది. సెస్సుల రాష్ట్యాలకు రావల్సిన వేల కోట్లు దండుకుంటోంది. నల్ల చట్టాలను రద్దు చేసినట్లే పెట్రోల్, డీజిల్ పై సెస్సులు రద్దు చేయాలని వినోద్ కుమార్ డిమాండ్ చేశారు.
అలాగే ఢిల్లీ ధర్నాల్లో ప్రాణాలు కోల్పోయిన రైతు కుటుంబాలను కేంద్రం ఆదుకోవాలన్నారు.
తెలంగాణకు రావల్సిన ఎరువులను ఎన్నికలు జరుగుతున్న పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రలకు కేంద్రం మళ్లించిందని విమర్శించారు.
వెంటనే వాటా ప్రకారం తెలంగాణకు రావాల్సిన ఎరువులకు పంపించాలన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, మాజీ ఎమ్మెల్యేలు ఆరెపల్లి మోహన్, కొండూరి సత్యనారాయణ గౌడ్ తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
అసెంబ్లీ ఎన్నికల తర్వాత మళ్లీ తెరపైకి నల్లచట్టాలు : అఖిలేష్ యాదవ్
అన్ని ఫార్మాట్ల క్రికెట్కు గుడ్బై చెప్పిన ఏబీ డివిలియర్స్
ఇది రైతులు సాధించిన చారిత్రక విజయం : మంత్రి సత్యవతి