హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): చేనేతపై విధిస్తున్న 5 శాతం జీఎస్టీ పన్నును పూర్తిగా రద్దు చేసి నేతన్నకు ఊరట కల్పించాలని కేంద్ర సర్కారును భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఎంపీ వద్దిరాజు రవిచంద్ర డిమాండ్ చేశారు. పత్తికి కనీస మద్దతు ధరను రూ.12 వేలకు పెంచాలని కోరారు. రాజ్యసభలో శుక్రవారం ఆయన ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ రైతు అనుకూల పథకాలు అమలు చేస్తుండడంతో పంటల దిగుబడి గణనీయంగా పెరిగిందని రవిచంద్ర చెప్పారు. పత్తికి ప్రస్తుతం ఇస్తున్న రూ.6,080 కనీస మద్దతు ధర సరిపోవడం లేదన్నారు. దానిని రెట్టింపు చేసి, రైతన్నను ఆదుకోవాలని కేంద్రాన్ని కోరారు.