హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ): జేఈఈ మెయిన్ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ గురుకుల ఇంటర్ విద్యార్థులు సత్తా చాటారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా 1,189 మంది విద్యార్థులు పరీక్షలో అర్హత సాధించారు. రాష్ట్రంలోని గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ (ప్రతిభా కాలేజీ)ల నుంచి ఈ ఏడాది మొత్తం 2,181మంది విద్యార్థులు జేఈఈ పరీక్షకు హాజరయ్యారు. ఆలిండియా స్థాయిలో 56 మంది విద్యార్థులు 90 పర్సంటైల్తో, 256 మంది విద్యార్థులు 80 పర్సంటైల్పైగా సాధించారు. ఎస్సీ గురుకులంలో రామకృష్ణ 98.98, రంజిత్ 98.75, డప్పు పల్లవి 98.48, సాత్విత్ 97.98, వర్ష 97.93, ఎస్టీ గురుకులంలో పీ వంశీ 99.21, భూక్య బాలాజీ 97.65, లోకేశ్ 96.19, ధనావత్ గౌతమి 93.9 అత్యధిక పర్సంటైల్తో ప్రతిభను చాటారు. ఈ సందర్భంగా విద్యార్థులను, అందుకు కృషిచేసిన సిబ్బందిని మంత్రులు కొప్పుల ఈశ్వర్, సత్యవతి రాథోడ్, గురుకుల సొసైటీ కార్యదర్శి రోనాల్డ్ రాస్ ప్రత్యేకంగా అభినందించారు.