జనగామ : పట్టుదలతోనే అసాధ్యాలు సుసాధ్యం అవుతాయి. అందుకు నిదర్శనం అబ్దుల్ కలామే అని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జిల్లాలోని పాలకుర్తి జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం విగ్రహాన్ని ఆవిష్కరించారు.
పదో తరగతి ఫలితాల్లో అత్యంత ప్రతిభ కనబరచిన విద్యార్థులకు మంత్రి సన్మానం చేశారు. ఉత్తమ సేవలు అందించిన ఆ స్కూల్ అటెండర్ భిక్షపత్తిని మంత్రి సత్కరించారు. అనంతరం మంత్రి విద్యార్థులతో కలిసి మధ్యాహ్నం భోజనం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..జీవితమంతా..శాస్త్రవేత్తగా, విద్యావేత్తగా సమాజం కోసం పాటుపడిన మహనీయులు డా.ఏపీజే అబ్దుల్ కలాం అన్నారు. సామాన్య కుటుంబంలో జన్మించిన కలాం బాగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించారన్నారు. పాలకుర్తిలో ఇలాంటి మహనీయుడు విగ్రహం పెట్టడం అభినందనీయం.
ఈ విగ్రహ ఏర్పాటుకు సారథ్యం వహించిన హెల్పింగ్ హ్యాండ్స్ గంట రవీందర్ను మంత్రి అభినందించారు. అలాగే పదో తరగతిలో 10/10 మార్కులు వచ్చిన 5 గురికి రవీందర్ తమ స్వచ్ఛంద సంస్థ మహాత్మా హెల్పింగ్ హ్యాండ్ తరపున తలా 10వేల చొప్పున పంపిణీ చేశారు. కార్యక్రమంలో వందేమాతరం ఫౌండేషన్ చైర్మన్ తక్కెళ్ళ పల్లి రవీందర్ రావు తదితరులు పాల్గొన్నారు.