నాందేడ్ నుంచి నమస్తే తెలంగాణ ప్రతినిధి బృందం, ఫిబ్రవరి 5: నాందేడ్ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగానికి విశేష స్పందన లభించింది. ప్రజలు మంత్రముగ్ధులై ఆయన ప్రసంగం విన్నారు. కేసీఆర్ తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ.. ఛత్రపతి శివాజీ, అంబేద్కర్, ఫూలే వంటి మహనీయులు పుట్టిన పుణ్యభూమి మహారాష్ట్రలో సభ నిర్వహించడం సంతోషంగా ఉన్నదనగానే పెద్దపెట్టున హర్షధ్వానాలు వినిపించాయి. మహారాష్ట్ర ‘వీరోంకీ యాద్ కరే.. వీర్నేత కేసీఆర్జీకీ జై’ అనే నినాదాలు మిన్నంటాయి. ఆగకుండా మోగుతున్న జనం చప్పట్ల మధ్యే కేసీఆర్ ప్రసంగం కొనసాగించాల్సి వచ్చింది. మహారాష్ట్ర రైతుల ఆత్మహత్యల గురించి కేంద్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించిన కేసీఆర్.. అందుకే ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ నినాదాన్ని బీఆర్ఎస్ ఎత్తుకున్నదని చెప్పడంతో ‘జై కేసీఆర్’, ‘జై భారత్’ నినాదాలు హోరెత్తాయి. నాగలి పట్టే చేతులు శాసనాలు చేయాల్సిన రోజులొచ్చాయన్న మాటలకు స్పందన వచ్చింది. కేంద్రం ప్రజలపై చూపాల్సిన ప్రేమను ఆదానీపై చూపుతున్నదని చెప్పినప్పుడు కరతాళధ్వనులతో సభ మార్మోగింది. బీఆర్ఎస్కు అధికారమిస్తే రెం డేండ్లలో మహారాష్ట్రలో కూడా 24 గంటలు విద్యుత్తు ఇస్తామని హామీ ఇవ్వడంతో కేరింతలు కొట్టారు. హిందీలో ప్రసంగించిన కేసీఆర్ మధ్యమధ్యలో మరాఠా పదాలను కూడా ఉపయోగించారు. తమ భాషను కేసీఆర్ నోటి వెంట విన్నప్పుడు ఈలలు వేశారు. ‘ఎన్నికల్లో గెలవాల్సింది నేతలు కాదు, ప్రజలు, రైతులు’ అన్నప్పుడు కూడా ప్రజలు ఇలాగే స్పందించారు. తాము అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా రైతుబంధు, దళితబంధు అమలు చేస్తామని చెప్పడంతో చప్పట్లతో హర్షం తెలిపారు.
కేసీఆర్ ప్రసంగం ఆద్యంతం సభికులు ‘అప్ కీ బార్ కిసాన్ సర్కార్’ నినాదాలతో హోరెత్తించారు. ‘దేశ్కి నేత కైసా హో కేసీఆర్కి జైసా హో’ అంటూ చేసిన నినాదాలతో సభా ప్రాంగణమంతా మార్మోగిపోయింది. ‘కేసీఆర్ జరూర్ అనా.. దేశ్కో బదల్నా’ అంటూ నినదించారు. ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే… సంకల్పం ఉంటే 8 ఏండ్లలో తెలంగాణలో ఏం జరిగిందో మీరు చూస్తున్నారు’ అని కేసీఆర్ అనగానే ‘మాలూమ్ హై.. మాలూమ్హై’ అంటూ స్పందించారు. మహారాష్ట్ర రైతుల కష్టాలు తీరాలంటే తెలంగాణలో మాదిరిగా 24 గంటల ఉచిత కరెంట్ కావాల్నా..? అని కేసీఆర్ ప్రశ్నించగానే చేతులు పైకెత్తి మరీ ‘కావాలి… కావాలి’ అని బదులిచ్చారు. ‘మీ బిడ్డగా.. మీ సోదరుడిగా మీలో ఒకడిగా అడుగుతున్న మార్పు కోసం పిడికెత్తి బయలుదేరుదామా? అని ప్రశ్నించగానే.. ‘జరూర్.. జరూర్’ అంటూ నాందేడ్ పిడికిలెత్తి బదులిచ్చింది.
సభలో రైతుబంధు, రైతబీమా, దళితబంధు, గురుకుల విద్యాలయాలు, కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మీ తదితర పథకాలు, అవి సాధిస్తున్న ఫలితాలను వివరిస్తూ రూపొందించిన ఆ ఆ డాక్యుమెంటరీలను సభకు విచ్చేసినవారందరూ ఎంతో ఆసక్తిగా తిలకించారు.