హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ దవాఖానల్లో ఆరోగ్యశ్రీ సేవలు రెండేండ్లలోనే 18 శాతం పెరిగాయని వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రభుత్వ దవాఖానల్లో అత్యాధునిక పరికరాలు, అన్నిరకాల వసతులు కల్పించడంతో ప్రజల్లో నమ్మకం పెరిగిందని స్పష్టంచేశారు. 2014 నుంచి ఇప్పటివరకు 11 లక్షల మందికి ఆరోగ్యశ్రీ సేవలు అందాయని, ఇందుకోసం ప్రభుత్వం రూ.5,600 కోట్లు ఖర్చు చేసిందని చెప్పారు.
ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్(ఏబీడీఎం) అమలులో తెలంగాణకు ‘ఆయుష్మాన్ ఉత్రిష్టత’ పురసారం లభించడంపట్ల సిబ్బందిని మంత్రి అభినందించారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలపై మంత్రి హరీశ్రావు మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 2020-21లో రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ కింద జరిగిన సర్జరీల్లో 34 శాతం ప్రభుత్వ దవాఖానల్లో జరిగాయని, ఈ ఏడాదికి అది 53 శాతానికి పెరిగిందని చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడం, ఎంఆర్ఐ సానింగ్, సీటీ సానింగ్, క్యాథ్ ల్యాబ్ వంటి ఆధునిక పరికరాలను అందుబాటులోకి తేవడం వల్ల రెండేండ్లలోనే ఆరోగ్యశ్రీ సర్జరీలు దాదాపు రెట్టింపు అయ్యాయని పేర్కొన్నారు.
సీహెచ్సీలు, పీహెచ్సీల్లోనూ ఆరోగ్యశ్రీ సేవలు అందించడం కూడా ఒక కారణమని వెల్లడించారు. గతేడాది ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద రూ.826 కోట్లు ఖర్చు చేసిందన్నారు. ఆరోగ్యశ్రీ కింద సర్జరీలు చేసిన తర్వాత రోగుల ఆరోగ్య పరిస్థితిని ఆరోగ్య మిత్రలతోపాటు ఆరోగ్యశ్రీ సిబ్బంది ఎప్పటికప్పుడు తెలుసుకొని సలహాలు ఇవ్వాలని సూచించారు. ఏవైనా అనారోగ్య లక్షణాలు కల్పిస్తే వెంటనే దవాఖానలకు తరలించాలని ఆదేశించారు. రోగులను డిశ్చార్జ్ చేసేటప్పుడు మందులు ఇస్తున్నారో లేదో ఆరోగ్యశ్రీ సిబ్బంది పరిశీలించాలని చెప్పా రు. ఏడీబీఎం అమలులో తెలంగాణ ఉత్తమ రాష్ట్రంగా నిలిచిన సందర్భంగా ఆరోగ్య, వైద్య సిబ్బందిని మంత్రి ప్రశంసించారు. కార్యక్రమంలో ఆరోగ్య శ్రీ సీఈవో విశాలాచ్చి, జిల్లా సమన్వయ కర్తలు, టీం లీడర్లు పాల్గొన్నారు.
ఎంఎల్హెచ్పీ పోస్టుల అర్హతలను సవరించండి
పల్లె దవాఖానలు, బస్తీ దవాఖానల్లో నియమించే ఎంఎల్హెచ్పీ పోస్టుల అర్హతల్లో మార్పులు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు కోరారు. బీఎస్సీ నర్సింగ్, ఆయుర్వేద విద్యార్థులతో సమానంగా యునాని (బీయూఎంస్), నేచురోపతి(బీఎన్వైఎస్), హోమియోపతి (బీహెచ్ఎంఎస్) కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులకు కూడా ఎంఎల్హెచ్పీ నియామకాల్లో అవకాశం కల్పించాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుక్ మాండవీయకు లేఖ రాశారు.
ఆయుష్మాన్ భారత్- హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లలో నియమించే ఎంహెచ్ఎల్పీ పోస్టులకు బీఎస్సీ కమ్యూనిటీ హెల్త్, బీఎస్సీ నర్సింగ్, జీఎన్ఎం అభ్యర్థులతోపాటు ఆయుర్వేద కోర్సు పూర్తిచేసి ఇగ్నో లేదా ఏదైనా మెడికల్ యూనివర్సిటీ నుంచి పబ్లిక్ హెల్త్/ప్రైమరీ హెల్త్ సర్వీసెస్ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులని నేషనల్ హెల్త్ మిషన్ ఇటీవల పేర్కొన్నది. ఈ నిర్ణయం మిగతా అభ్యర్థులకు నష్టం కలిగిస్తున్నదని హరీశ్రావు లేఖలో పేర్కొన్నారు.