నిజామాబాద్కు వచ్చేటప్పుడు హైదరాబాద్ను చూస్తుంటే మరికొద్ది కాలంలోనే మనదేశం విశ్వగురువుగా మారటం తథ్యమని అనిపించింది. జై జవాన్ జై కిసాన్ అన్న నినాదం అందరూ ఇస్తారు. కానీ, దానిని నిజం చేసింది మాత్రం కేసీఆర్ ఒక్కరే. రైతులను పట్టించుకొన్న వ్యక్తి తెలంగాణ ముఖ్యమంత్రే. ఇలాంటోళ్లు పాలిస్తే రైతులకు కనీస మద్దతు ధర తప్పకుండా అందుతుంది.
-పంజాబ్ స్పీకర్ కుల్తార్ సింగ్ సాంద్వాన్
హైదరాబాద్/నిజామాబాద్, డిసెంబర్ 24: ‘క్యా కమాల్ హై! కేసీఆర్ నే తెలంగాణమే ఇత్నా చమత్కార్ కర్ దియా! జైసే గవర్నమెంట్ ఆఫీసర్ కా చాంబర్ యహా హై.. వో ఢిల్లీమే సెంట్రల్ మినిస్టర్కాభీ నహీ హై! ఇత్నా డెవలప్మెంట్ బాకీ స్టేట్స్మే కహాభీ నహీ హై!’.. ఈ మాటలన్నది మామూలు వ్యక్తి కాదు. పంజాబ్ శాసనసభ స్పీకర్ కుల్తార్ సింగ్ సాంద్వా న్. నిజామాబాద్ సమీకృత కలెక్టరేట్ను చూసి సంభ్రమాశ్చర్యాలతో అన్న మాటలివి. నిజామాబాద్ నగరంలోని పలు అభివృద్ధి పనులతోపాటు, నూతన సమీకృత కలెక్టరేట్ భవనాన్ని, పరిపాలన తీరుతెన్నులను స్థానిక ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా, బీఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ బిగాల మహేశ్ గుప్తాతో కలిసి కుల్తార్ బృందం శనివారం పరిశీలించింది. పంజాబ్ స్పీకర్ ప్రతినిధి బృందంలో డిప్యూటీ స్పీకర్ జైసింగ్ రౌరీ, రాజ్యసభ సభ్యుడు పీ విక్రమ్జిత్ సింగ్ సహాని, ఎమ్మెల్యేలు కుల్వంత్ సింగ్ పండోరి, అమర్జిత్ సింగ్ తదితరులు ఉన్నారు. సమీకృత కలెక్టరేట్ను పరిశీలించిన అనంతరం కుల్తార్ సింగ్ మీడియాతో మాట్లాడారు. దేశంలో రైతులకు నేరుగా డబ్బులిచ్చి ఆదుకొంటున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆరేనని చెప్పారు. దేశానికి వెన్నెముకలాంటి రైతులను ఆదుకొనేవారికి భగవంతుడి చల్లని దీవెనలు, రక్షణ ఎల్లప్పుడూ ఉంటాయని అన్నారు. అలాంటివారు తప్పక విజయం సాధిస్తారని పేర్కొన్నారు.
జై జవాన్ జై కిసాన్ నినాదాన్ని నిజం చేసిన కేసీఆర్
తెలంగాణలో రైతులకు ఉచితంగా కరెంటు ఇవ్వడం గొప్ప విషయమని కుల్తార్సింగ్ అన్నారు. ‘నిజామాబాద్కు వచ్చేటప్పుడు హైదరాబాద్ను చూస్తుంటే మరికొద్ది కాలంలోనే మనదేశం విశ్వగురువుగా మారటం తథ్యమని అనిపించింది. జై జవాన్ జై కిసాన్ అన్న నినాదం అందరూ ఇస్తారు. కానీ, దానిని నిజం చేసింది మాత్రం కేసీఆర్ ఒక్కరే. రైతులను పట్టించుకొన్న వ్యక్తి తెలంగాణ ముఖ్యమంత్రే. ఇలాంటోళ్లు పాలిస్తే రైతులకు కనీస మద్దతు ధర తప్పకుండా అందుతుంది. ఢిల్లీలో రైతులు ధర్నా చేసినప్పుడు మేమంతా అండగా నిలిచి వారితోపాటు ఆందోళన చేశాం. అప్పుడే రైతులంతా తెలంగాణలో వ్యవసాయాభివృద్ధికి కేసీఆర్ చేస్తున్న సాయం గురించి పెద్ద ఎత్తున చర్చించుకొన్నారు. రైతుబంధు ద్వారా ఎకరాకు ఏటా రూ.10 వేలు ఇవ్వడం నిజంగా ఆశ్చర్యంగా ఉన్నది. గత 70 ఏండ్లలో ఎవరూ ఇలాంటి ప్రయత్నం చేయలేదు. ఇంటింటికీ తాగు నీరు, పెండ్లిళ్లకు కల్యాణలక్ష్మి ఇవ్వడం చాలా పెద్ద విషయం. రైతు బాగుంటే సమాజం బాగుంటుంది. రైతు బాగుంటేనే ప్రతి ఒక్కరూ సంతోషంగా జీవిస్తారు. అలాంటి రైతును ఎవరూ విస్మరించకూడదు. కేంద్రంలో రాబోయేది కిసాన్ సర్కారే’ అని పేర్కొన్నారు.
దేశాన్ని ఆలోచింపజేస్తున్న ఇక్కడి పథకాలు
తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు దేశం మొత్తాన్ని ఆలోచింపజేస్తున్నాయని కుల్తార్సింగ్ సాంద్వాన్ అన్నారు. కిసాన్ సరార్ కోసం పనిచేస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్కు అందరూ మద్దతివ్వాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడినప్పటికీ మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేశారని ప్రశంసించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తుంటే, తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం రైతులకు వెన్నుదన్నుగా నిలిచిందని పేర్కొన్నారు. రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత కరెంటు, షాదీముబారక్, కల్యాణలక్ష్మి వంటి పథకాలు అద్భుతమని కొనియాడారు. సీఎం కేసీఆర్ ముందుచూపుతో భారీగా సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి నీటి కొరత లేకుండా చేశారని ప్రశంసించారు.
మా సీఎం చాంబర్కంటే కలెక్టరేట్ బాగున్నది
నిజామాబాద్ సమీకృత కలెక్టరేట్ను చూసి కుల్తార్ సింగ్ సాంద్వానాతోపాటు ఇతర ఎంపీ, ఎమ్మెల్యేలంతా మంత్రముగ్ధులైపోయారు. తమ రాష్ట్రంలో సీఎం చాంబర్ కూడా ఇంత అద్భుతంగా లేదని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో కేంద్ర మంత్రుల కార్యాలయాలు కూడా ఇంతలా లేవని తెలిపారు.సమావేశ మందిరాన్ని చూసి కార్పొరేట్ బంగ్లాలా ఉన్నదని అన్నారు. ఐటీ కంపెనీల్లోనూ ఇంత అద్భుతమైన నిర్మాణం ఉండదని వారు మాట్లాడుకోవటం కనిపించింది. ఒకే చోట కార్యాలయాలన్నీ ఉండటం వల్ల ప్రజలకు అద్భుతమైన సేవలు అందుతున్నాయని అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, చిత్రా మిశ్రాతో పాటుగా ఎమ్మెల్యే గణేశ్గుప్తా వివరించారు. పక్కనే నిర్మించిన ఐటీ హబ్ విశిష్టతలను గణేశ్ గుప్తా వారికి తెలిపారు. మీడియా సమావేశంలో మేయర్ నీతూకిరణ్, నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు సుజిత్ సింగ్ ఠాకూర్, సిర్ప రాజు, దండు శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
వారి ఆనందం మాటల్లో చెప్పలేం
నిజామాబాద్ నగర సందర్శనకు పంజాబ్ స్పీకర్ కుల్తార్ సింగ్ సాంద్వాన్తో పాటు అక్కడి రాజ్యసభ ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేలు రావడం సంతోషం అనిపించింది. కుల్తార్సింగ్, నేను హైదరాబాద్లో కలిసి చదువుకొన్నాం. ఆయనకు నేను సీనియర్ అయినప్పటికీ కాకతాళీయంగా ఇప్పుడు రాజకీయాల్లో ప్రజా ప్రతినిధులుగా ఇద్దరం కొనసాగుతున్నాం. తెలంగాణలో జరిగిన అభివృద్ధిని చూసి వారంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వైకుంఠధామాలు, రోడ్లు, కలెక్టరేట్ బిల్డింగ్.. ఇలా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. కేంద్రం నుంచి సహకారం లేకున్నా ఇంతగా తెలంగాణ అభివృద్ధి చెందటం సీఎం కేసీఆర్ గొప్పతనానికి నిదర్శనమని పేర్కొన్నారు. ముఖ్యంగా డబుల్ బెడ్ రూం ఇండ్లను చూసి అద్భుతమని ప్రశంసించారు.
– బిగాల గణేశ్ గుప్తా, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే