Delhi Liquor Policy | హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ)/(స్పెషల్ టాస్క్ బ్యూరో): ఢిల్లీ మద్యం కుంభకోణం ఓ బూటకమని ఆప్ ముఖ్యనేత, ఢిల్లీ మంత్రి ఆతిషి అన్నారు. ఈడీ, సీబీఐ చార్జిషీట్లోని స్క్రిప్ట్ పీఎంవో నుంచే రాస్తున్నారని, ఆ స్క్రిప్ట్కు ఆధారాలు సేకరించాలంటూ అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారని ఆమె ఆరోపించారు. బీజేపీ నేతలు ఆరోపించినట్టుగా ఈ కేసులో ఒక్క పైసా లావాదేవీలపైనైనా సీబీఐ, ఈడీ వద్ద ఆధారాలు లేవని స్వయంగా కోర్టే అభిప్రాయపడిందని గుర్తు చేశారు. ఏడాదికాలంగా బీజేపీ నేతలు ప్రెస్మీట్ల మీద ప్రెస్మీట్లు పెట్టి చేసిన ఆరోపణలే.. సీబీఐ, ఈడీ చార్జిషీట్లలో కనపడ్డాయని, అంతకుమించి ఈ కేసులో ఏమీ లేదని ఎద్దేవా చేశారు. లంచం, కిక్బ్యాక్ చెల్లింపులకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని న్యాయస్థానం తేల్చి చెప్పిందని పేర్కొన్నారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడిన ఆతిషి.. ‘ఆరు నెలలకుపైగా సీబీఐ, ఈడీలు దర్యాప్తు చేస్తున్నాయి. రెండు దర్యాప్తు ఏజన్సీలకు చెందిన సుమారు 500 మందికిపైగా అధికారులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. రూ.100 కోట్ల కిక్బ్యాక్లు పొందారని ఆరోపణలు చేశారు. ఈ వంద కోట్ల రూపాయలను గోవా ఎన్నికల్లో ఖర్చు చేశారని పదే పదే ప్రెస్మీట్లు పెట్టి చెప్పారు. కానీ రౌస్ ఎవెన్యూ కోర్టు రాజేశ్జోషి, గౌతమ్ మల్హోత్రాలకు బెయిల్ ఇచ్చింది. 85 పేజీల ఆర్డర్ ఇచ్చింది. ఈ ఆర్డర్ కాపీని బీజేపీ నేతలు చదివి ఉంటారని అనుకుంటున్నా’ అని పేర్కొన్నారు.
బీజేపీ నేతలు ఆరోపించినట్టు.. లంచం, కిక్బ్యాక్ల చెల్లింపునకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవంటూ కోర్టు తేల్చి చెప్పిందని ఆతిషి గుర్తుచేశారు. సాక్షులు చెప్పిన దాని ప్రకారం చెల్లింపులు జరిగినట్టు పరిగణించలేమంటూ కోర్టు ఇచ్చిన ఆదేశాల కాపీని ఆమె చదివి వినిపించారు. తొలుత రూ.100 కోట్ల స్కామ్ అని ఆరోపించిన అధికారులు.. తర్వాత మాటమార్చి రూ.30 కోట్లు అంటున్నారని విమర్శించారు. ఆ మొత్తానికి కూడా వారు ఆధారాలు చూపలేకపోయారని పేర్కొన్నారు. ‘రాజేశ్ జోషి ద్వారా రూ. 30 కోట్లు ఢిల్లీకి.. అలాగే గోవాకు వెళ్లాయని ఆరోపించారు. అయితే వారి దగ్గర వీరి నంబరు, వీరి వద్ద వారి నంబరు ఉంది. కాల్స్ చేసుకున్నారు. ఇదంతా చార్జిషీట్లో నమోదు చేశారు’ అని ఆతిషి తెలిపారు. అయితే ఇలాంటి అంశాలను ఆధారాలుగా పరిగణించలేమని కోర్టు తెలిపినట్టు ఆమె పేర్కొన్నారు. డిజిటల్గా కానీ.. హవాలా ఆపరేటర్ల నుంచి గానీ ఈ డబ్బు తరలించినట్టు ఆధారాలు సమర్పించలేదని న్యాయస్థానం చెప్పడంతోపాటు.. స్వతంత్ర ఆధారాలేవీ దర్యాప్తు సంస్థలు సేకరించలేదని కోర్టు అభిప్రాయపడిందని మంత్రి తెలిపారు.
కుంభకోణం ఆరోపణలు చేసిన బీజేపీ నేతలు ప్రెస్మీట్ పెట్టి క్షమాపణ కోరాలంటూ ఆతిషి డిమాండ్ చేశారు. చార్జిషీట్లు సీబీఐ, ఈడీలు రూపొందించడం లేదని, ప్రధానమంత్రి కార్యాలయంలో అవి తయారవుతున్నాయని ఆమె మండిపడ్డారు. దర్యాప్తులో అధికారులు దాడులతో భయభ్రాంతులకు గురిచేస్తున్నారని విచారణను ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరూ చెప్పినట్టు ఆమె తెలిపారు. సంజయ్సింగ్ పేరును మొదట పేర్కొన్నారని, లీగల్ నోటీసు పంపగానే.. తప్పు జరిగిందని క్షమాపణ కోరారని గుర్తుచేశారు. లేని కుంభకోణాన్ని రుద్ది, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారని విమర్శించారు. దీనిపై దేశ ప్రజలకు ప్రధాని, బీజేపీ నేతలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సిసోడియాకు వ్యతిరేకంగా కూడా ఎలాంటి ఆధారాలనూ దర్యాప్తు సంస్థలు సమర్పించలేదని ఆమె పేర్కొన్నారు.