న్యూఢిల్లీ, జూన్ 18: ఓటర్ల జాబితాతో ఆధార్ వివరాలను అనుసంధానించే ప్రక్రియకు సంబంధించి ఓటర్ల నమోదు రూల్స్లో కేంద్రం ప్రభుత్వం సవరణలు చేసింది. అదేవిధంగా 18 ఏండ్లు నిండిన వారు ఏడాదిలో నాలుగుసార్లు ఓటరుగా నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. క్వాలిఫైయింగ్ తేదీలుగా జనవరి 1, ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1గా నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖలోని లెజిస్లేటివ్ డిపార్ట్మెంట్ శుక్రవారం రాత్రి పలు నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఓటర్ల జాబితాలో ఇప్పటికే పేరు నమోదై ఉన్న వారు వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నాటికి తమ ఆధార్ను అధికారులకు తెలియపరచాలని ఓ నోటిఫికేషన్లో పేర్కొన్నది. పార్లమెంట్ గతేడాది ఆమోదించిన ఎన్నికల చట్టాల(సవరణ) చట్టం-2021లోని నిబంధనలకు అనుగుణంగా రూల్స్ సవరించినట్టు ప్రభుత్వం పేర్కొన్నది. తాజా రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టోర్స్(అమెండ్మెంట్) రూల్స్-2022 ఈ ఏడాది ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. నకిలీ ఓటర్లను జాబితా నుంచి తొలగించేందుకు కొత్త రూల్స్ సహకరిస్తాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.