హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చేందుకు కేంద్రం కొత్త నిబంధనలను తెరపైకి తెస్తున్నది. ఇప్పటికే బడ్జెట్లో నిధుల కేటాయింపులు తగ్గించి, పనులు లేకుండా చేస్తున్న బీజేపీ సర్కారు ఏదో ఒక కొర్రీ పెడుతూ కూలీల ఉపాధిని దెబ్బతీస్తున్నది. ఇప్పటికే ఉపాధి హామీ నిధులతో తెలంగాణలో నిర్మించిన పంట కల్లాలపై కన్నెర్ర చేసి ఇచ్చిన బిల్లులను వెనక్కి ఇచ్చేయాలని ఒత్తిడి తెస్తున్నది. తాజాగా ఉపాధి హామీ కూలీలకు ఇచ్చే జాబ్కార్డులకు తప్పనిసరిగా ఆధార్ అనుసంధానం చేయాలని షరతు విధించింది. వెంటనే కూలీలందరూ తమ జాబ్కార్డులకు ఆధార్ అనుసంధానం చేయాలని, లేకుంటే చెల్లింపులు నిలిపివేస్తామని హెచ్చరించింది. కేంద్రం వార్నింగ్తో గ్రామ పంచాయతీ కార్యదర్శులు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లు గ్రామాల్లో ఆధార్ అనుసంధానం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ప్రతి ఉపాధి హామీ కూలీ ప్రాథమిక వివరాలను ఇప్పటికే జాబ్కార్డులో నమోదు చేశారు. దీంతోపాటు కుటుంబసభ్యుల వివరాలు, బ్యాంకు ఖాతా నంబర్ కూడా కేంద్రం వద్ద ఉన్నది.
కూలీలను ఉపాధి హామీ పనులకు దూరం చేసేలా కేంద్ర ప్రభుత్వం ఒక్కో నిబంధన విధిస్తూ ముప్పుతిప్పలు పెడుతున్నది. తాజాగా జాబ్కార్డుకు ఆధార్ లింకు చేయాలనే నిబంధనను తెరపైకి తీసుకురావడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆధార్ అనుసంధానమే కాదు, అథెంటిఫికేషన్ చేయాలని కూడా ఆదేశించింది. ఈ నెల నుంచి పనిచేసిన కూలీలకు డబ్బులు రావాలంటే ఆధార్ కార్డు లింక్ చేయాల్సిందేనని, లేకుంటే డబ్బులు ఇవ్వబోమని ప్రకటించింది. చేసేది లేక పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు ఉపాధి హామీ పనుల కంటే ముందు ఆధార్ అనుసంధానం కోసం తిరుగుతున్నారు. గ్రామాల్లో చాటింపు, మైకుల ద్వారా జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఇంటి కుటుంబ పెద్దే కాకుండా జాబ్కార్డులో పేరున్న ప్రతిఒక్కరూ ఆధార్కార్డు తీసుకురావాలని అధికారులు సూచిస్తున్నారు. ఆధార్ లేని వారు వెంటనే దరఖాస్తు చేసుకొని ఐడీ నంబర్ను నమోదు చేయాలని కోరుతున్నారు.
కేవలం 42 పనిదినాలే..
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఏడాదికి కనీసం 100 రోజులు పని కల్పించాల్సి ఉన్నది. ఇందుకు విరుద్ధంగా ఈ ఆర్థిక సంవత్సరం (2022-23)లో ఇప్పటివరకు కేవలం 42 రోజులే పని కల్పించడం కేంద్రం నిర్లక్ష్యానికి పరాకాష్ఠ. గత ఐదేండ్లలో ఇదే అతి తక్కువ పనిరోజులు కల్పించిన ఆర్థిక సంవత్సరమని గణాంకాలు చెబుతున్నాయి. దీనికితోడు కూలీల హాజరు యాప్లో నమోదు చేయాలని నిబంధన విధించడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్కువ వేతనాలిస్తూ, పనిదినాల్లో కోత పెడుతూ ఇప్పుడు ఆధార్ లింక్ చేస్తేనే వేతనాలు ఇస్తామని కేంద్రం నిర్ణయించడంపై నిరుపేద కూలీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ ఉపాధిని దెబ్బతీసేందుకే కొత్తరకం నిబంధనలు పెడుతున్నదని మండిపడుతున్నారు.