Rajanna Siricilla | సిరిసిల్లలోని బీవై నగర్లో పిడుగు పడి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఉదయం క్రికెట్ ఆడేందుకు ఓ ఐదుగురు యువకులు బీవై నగర్ వెళ్లగా, అక్కడ వర్షం కురిసింది. దీంతో అక్కడే ఉన్న చెట్టు కిందకు ఐదుగురు వెళ్లారు. అదే సమయంలో చెట్టుపై పిడుగు పడింది. ఐదుగురిలో ఓ యువకుడు పిడుగు ధాటికి ప్రాణాలు కోల్పోయాడు. మిగతా నలుగురు కూడా కిందపడిపోయారు. మృతుడిని పడిగే సతీశ్(32)గా గుర్తించారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. సతీశ్ మెకానిక్ షాపు నిర్వహిస్తూ, జీవనోపాధి పొందుతున్నాడు. మృతుడి నివాసంలో విషాదఛాయలు అలుముకున్నాయి.