వరంగల్ చౌరస్తా, ఏప్రిల్ 8: వరంగల్ ఎంజీఎంలోని కొవిడ్ వార్డులో చికిత్స పొందుతూ ఓ యువకుడు మృతిచెందాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన మామిడి సుమన్ మార్చి 31న కొవిడ్ లక్షణాలతో వరంగల్ ఎంజీఎం కొవిడ్ వార్డులో చేరి చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి మృతిచెందాడు. ఈ ఘటనపై ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ను వివరణ కోరగా.. కరోనాను ఎదుర్కోవడానికి చేసిన ఏర్పాట్లలో ఎలాంటి ఇబ్బంది లేదని, ప్రస్తుతం కొవిడ్ వార్డులో వైద్యసేవలకు అవసరమైన అన్ని పరికరాలు, ఆక్సిజన్ పైప్లైన్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.
మృతుడికి అందించిన చికిత్సలో ఎలాంటి లోపామూ లేదని తెలిపారు. సుమన్ మరణానికి కరోనా మాత్రమే కారణం కాదని, అతను కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నాడని ఆయన వివరించారు. సుమన్ మృతదేహాన్ని కొవిడ్ నిబంధనల ప్రకారం ప్రత్యేక బ్యాగులో ప్యాక్ చేసి కుటుంబసభ్యులకు అప్పగించామని చెప్పారు. ఏడాది కాలంగా కొవిడ్ బాధితుల చేరికలు లేకుండా ఉన్న ఈ వార్డులో సుమన్ అడ్మిట్ కావడం, చికిత్స పొందుతూ మృతిచెందడంతో ఎంజీఎం సిబ్బంది, రోగులు ఆందోళన చెందుతున్నారు. కొవిడ్ నిబంధనలను కఠినతరం చేసి అమలు చేయడానికి వైద్యాధికారులు చర్యలు చేపట్టినట్టు ఎంజీఎం సూపరింటెండెంట్ వెల్లడించారు.