ఎల్బీనగర్, అక్టోబర్ 28: చేనేత కార్మికుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అద్భుత మ్యూజియంను ఏర్పాటు చేయనున్నట్టు ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ వెల్లడించారు. అందుకు నేత కళాకారులు, మేధావులు తగిన సూచనలు, సలహాలతో సహకారం అందించాలని కోరారు. శుక్రవారం సాయంత్రం ఆయన ఎమ్మెల్సీ ఎల్ రమణ, వరంగల్ మేయర్ గుండు సుధారాణితో కలిసి గడ్డిఅన్నారం డివిజన్ శ్రీనగర్ కాలనీలోని పద్మశ్రీ అవార్డు గ్రహీత గజం గోవర్ధన్ నివాసంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేసిన గజం గోవర్ధన్ తేలీ రుమాల్ ఆర్ట్ గ్యాలరీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. పండుగల సమయంలో అందరూ చేనేత దుస్తులను ధరించి నేత కళాకారులకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. చేనేతపై పరిశోధనలు జరిపేలా విద్యార్థులకు వీలుకల్పించేందుకు సొంత వనరులతో చేనేత గ్యాలరీని ఏర్పాటు చేసిన గజం గోవర్ధన్ కృషి అభినందనీయమన్నారు.
రాష్ట్రంలో చేనేత కళను ప్రోత్సహించేందుకు సీఎం కేసీఆర్ అన్ని విధాలా కృషిచేస్తున్నారని తెలిపారు. ఇప్పటికే నూలు, రసాయనాలపై 40% సబ్సిడీ ఇవ్వడంతోపాటు నిరుపేద నేత కార్మికుడు మరణిస్తే వారి కుటుంబానికి నేతన్న బీమా ద్వారా చేయూతనిస్తున్నారని, ఇలాంటి కార్యక్రమాలు దేశంలో మరెక్కడా లేవని వివరించారు. కార్యక్రమంలో టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు చిలువేరు కాశీనాథ్, చేనేత నాయకులు గోషిక యాదగిరి, పున్న శ్రీనివాస్, రాపోలు సుధాకర్, టీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్కుమార్, మాజీ కౌన్సిలర్ రమేశ్ ముదిరాజ్, డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు శ్రీశైలం యాదవ్ పాల్గొన్నారు.