Snake Bite | ములుగు : ఉపాధి హామీ పనులకు వెళ్లిన ఓ మహిళను పాము కరిచింది. దీంతో అప్రమత్తమైన బాధితురాలు.. పామును వెంటనే చంపేసింది. అనంతరం ఆ పామును తీసుకొని ఆస్పత్రికి వెళ్లింది. ఈ ఘటన ములుగు జిల్లా వెంకటాపురం నూగురు మండలంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. వెంటాపురం నూగురు మండల పరిధిలోని ముకునూరుపాలెం గ్రామానికి చెందిన శాంతమ్మ సోమవారం ఉదయం ఉపాధి హామీ పనులకు వెళ్లింది. పని పూర్తయిన తర్వాత ఇంటికి తిరిగి వచ్చే సమయంలో పాము ఆమెను కాటేసింది. దీంతో ఆ పామును శాంతమ్మ చంపింది. దాన్ని ఓ ప్లాస్టిక్ డబ్బాలో వేసుకుని వెంకటాపురం ఆస్పత్రికి వెళ్లింది. కరిచిన పామును వైద్యులకు చూపించారు. ఆ తర్వాత వైద్యులు ఆమెకు చికిత్స అందించారు. ప్రాణాలతో బతికి బయటపడింది శాంతమ్మ.
ఏ పాము కరిచిందో తెలియకుండా డాక్టర్లు ఇంజక్షన్ ఇవ్వరని చెప్పి.. పామును చంపి ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు శాంతమ్మ తెలిపింది. పామును ఆస్పత్రికి తీసుకురావడంతో కంగుతిన్న డాక్టర్లు, విషపూరిత పాముగా గుర్తించి శాంతమ్మకు చికిత్స అందించారు.