Sangareddy | సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో విషాదం నెలకొంది. రాఘవేంద్ర నగర్ కాలనీలో నివాసం ఉంటున్న ఓ మహిళ తన ముగ్గురు పిల్లలకు విషమిచ్చి.. తానూ సేవించింది. దీంతో ముగ్గురు పిల్లలు ప్రాణాలు కోల్పోగా, తల్లి పరిస్థితి విషమంగా ఉంది. బాధిత మహిళను చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు.
ముగ్గురు పిల్లల మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రాణాలు కోల్పోయిన పిల్లలను సాయికృష్ణ(12), మధుప్రియ(10), గౌతమ్(8)గా గుర్తించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రజిత పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం.
అయితే గురువారం రాత్రి తన ముగ్గురు పిల్లలకు పెరుగు అన్నం పెట్టి.. ఆమె కూడా అదే ఆహారాన్ని తిన్నది. భర్త చెన్నయ్యకు మాత్రం పప్పు అన్నం పెట్టింది. పెరుగు అన్నం తిన్న ముగ్గురు పిల్లలు ఇంట్లోనే ప్రాణాలు వదిలారు. అయితే కుటుంబ కలహాల కారణంగానే రజిత ఈ అఘాయిత్యానికి ఒడిగట్టినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీరి స్వస్థలం రంగారెడ్డి జిల్లాలోని మెడకుపల్లి గ్రామం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.