కొణిజర్ల, మే 18 : మహిళలకు ఉచిత బస్సు పథకంతో బస్సులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. ఈ క్రమంలోనే ఓ మహిళ బస్సులో చోటులేక ఫుట్బోర్డుపై నిలబడటంతో ప్రమాదవశాత్తు జారిపడి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొణిజర్ల మండల పరిధిలోని పెద్దమునగాలకు చెందిన దూరి అనూష (26) ఖమ్మం నగరంలోని డీమార్ట్లో పనిచేస్తున్నది.
రోజు మాదిరిగానే ఖమ్మం వెళ్లేందుకు శనివారం ఉదయం కొణిజర్లలో బస్సు ఎక్కి ఫుట్పాత్పై నిలబడింది. బస్సు ఒక్కసారిగా ముందుకు కదలడంతో జారి వెనుక టైరు కిందపడటంతో అనూష అక్కడికక్కడే మృతిచెందింది. కొణిజర్ల ఎస్సై జే శంకర్రావు ఘటనా స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలికి భర్త అశోక్, ఇద్దరు పిల్లలు ఉన్నారు.