హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ): అనారోగ్యంతో మృతి చెందిన తన భర్తకు ఓ భార్య ఇంట్లోనే దహన సంస్కారాలు నిర్వహించింది. అట్టపెట్టెలతో చితిపేర్చి నిప్పంటించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని పత్తికొండ పట్టణానికి చెందిన పోతుగంటి హరికృష్ణప్రసాద్ (60), లలిత భార్యాభర్తలు. మెడికల్ షాపు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు.
సోమవారం ఉదయం హరికృష్ణప్రసాద్ ఇంటినుంచి పొగలు రావడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ వెంకటేశ్వర్లు సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకొని, పరిశీలించారు. తన భర్త అనారోగ్యంతో సోమవారం మృతిచెందినట్టు లలిత తెలిపింది. తండ్రి చనిపోయిన విషయం తెలిస్తే కుమారులిద్దరూ వచ్చి ఆస్తికోసం గొడవ చేస్తారని, ఆ భయంతోనే భర్తకు అట్టపెట్టెలతో దహనసంస్కారాలు పూర్తిచేసినట్టు తెలిపింది.