న్యూశాయంపేట, జనవరి 29: కాంగ్రెస్ పార్టీ మాయమాటలు నమ్మి మోసపోయామని ప్రజలు బాధపడుతున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి చెప్పారు. హనుమకొండలో సోమవారం మాజీ ఎమ్మెల్యే, వరంగల్ జిల్లా అధ్యక్షుడు అరూరి రమేశ్ అధ్యక్షతన నిర్వహించిన వర్ధన్నపేట నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిరంజన్రెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. గత అసెంబ్లీ ఎన్నికల్లో మరింత పట్టుదలగా పని చేసి ఉంటే మళ్లీ గెలిచేవారమని, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను కచ్చితంగా గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఓటమిపై సమీక్షించుకుని రాబోయే రోజుల్లో పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా సమావేశాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. మతాలపేరుతో రాజకీయాలు చేసే ప్రధాని మోదీకి మూడోసారి ప్రజలు ఎందుకు ఓట్లు వేయాలని, అక్షింతల పేరుతో రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.
రైతుబంధు ఏదీ?: ఎర్రబెల్లి
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్ 9న రైతుబంధు ఇస్తామని చెప్పినా ఇంకా ఇవ్వలేదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలులో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు గ్రామాల్లో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో చిన్నచిన్న కారణాలతో ఓడిపోయామని, కార్యకర్తల సూచనలను పరిగణనలోకి తీసుకొని పార్టీని బలోపేతం చేస్తామని చెప్పారు. ఆరూరి రమేశ్ మాట్లాడుతూ.. అధికారంలో ఉన్నా, లేకున్నా తాము ప్రజల పక్షాన నిలబడి పనిచేస్తామని, పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ జెండాను ఎగురవేస్తామని పేర్కొన్నారు. అనంతరం నియోజకవర్గంలోని వివిధ గ్రామాల సర్పంచుల పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో వారిని అరూరి రమేశ్ చేతులమీదుగా సన్మానించారు. సమావేశంలో వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు, జిల్లా రైతుబంధు కోఆర్డినేటర్ లలితాయాదవ్, జెడ్పీ వైస్చైర్మన్ శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.