Telangana | బీఆర్ఎస్ గవర్నమెంట్లో నాణ్యమైన 24 గంటల కరెంట్ ఇవ్వడంతో రైతులు సంతోషంగా వ్యవసాయం చేసుకుంటున్నారు. కానీ అదే కాంగ్రెస్ రాజ్యంలో కరెంట్ సరిగా లేక ఎంతో మంది రైతులు చనిపోయారు. ఇప్పుడున్నట్టు అప్పుడు కరెంట్ ఉంటే మా అన్న బతికేది.. అని ఓ సోదరుడు ఆవేదన వ్యక్తం చేశాడు.
మాది వికారాబాద్ జిల్లా.. 2005లో కరెంట్ షాక్తో మా అన్న చనిపోయిండు. కాంగ్రెస్ పాలనలో కరెంట్ వస్తుండే, పోతుండే. రాత్రి పూట చేనుకు నీళ్లుపెడుదామని పోయిండు. కరెంట్ సమయానికి రాకుండే.. మోటార్ వేయడానికి పోయి కరెంట్ షాక్తో ప్రాణాలు కోల్పోయిండు. 2005లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే. కరెంట్ ఎప్పుడు వస్తదో ఎప్పుడు పోతదో తెల్వదు. డేలో కూడా సక్రమంగా ఉండకుండే. కరెంట్ లేక రాత్రి పూట బావుల వద్దనే పడుకుని, మోటార్లు వేసుకునేది. రాత్రిపూట వచ్చిన కూడా ఒక రెండు గంటలు కూడా సరిగ్గా ఉండకపోయేది. కరెంట్ కోసం కావలి కూర్చోనేది.
ఇప్పుడున్నట్టు అప్పుడు కరెంట్ ఉంటే మా అన్న బతికేది. మా అన్నకు ఇద్దరు పిల్లలు. ప్రయివేటు జాబులు చేస్తున్నరు. మా అన్న కరెంట్ షాక్తో చనిపోయాక మా వదిన కూడా డిప్రెషన్లోకి వెళ్లింది. పనికి పోతూ పోతూ బస్సులో నుంచి కిందపడి మతి స్థిమితం కోల్పోయింది. కోమాలోకి వెళ్లిపోయింది. ఇప్పటికీ ఇబ్బంది పడుతోంది. భర్త చనిపోవడతోనే ఆమె అలా తయారైంది. భర్త లేని లోటును ఎవరూ తీర్చలేదు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెక్ట్గా కరెంట్ ఇచ్చిఉంటే మా అన్న బతికేది. కరెంట్ లేకనే రాత్రిపూట పోయి చనిపోయిండు. ఆ కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండి ఉంటే మా అన్న చనిపోయేది కాదు. మా అన్న లేకపోవడంతో ఆయన పిల్లలు ఇప్పుడు మెకానిక్లు అయ్యారు. అన్న ఉంటే మంచిగా చదివిపించి ఏదో ఉద్యోగాలు వస్తుండే. మా పెద్ద దిక్కు అన్న దూరమైపోయిండు. మా నాన్న కూడా బాగా మానసికంగా కుంగిపోయి ఆయన కూడా చనిపోయాడు. భర్త చనిపోయాక మా వదిన ఎన్నోకష్టాలు పడ్డది.
బీఆర్ఎస్ గవర్నమెంట్లో 24 గంటల కరెంట్ వస్తుంది. తెలంగాణ ప్రభుత్వంచాలా మంచి పని చేసింది రైతులకు. 60 ఏండ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలా మంది చనిపోయారు. ఇప్పుడు రైతు చనిపోతే 5లక్షల బీమా వస్తుంది. ఇది రైతు కుటుంబాలకు ఉపయోగకరంగా ఉంది. అప్పుడు ఏ బెనిఫిట్స్ లేవు. ఇప్పుడు రైతుబంధు వస్తుంది. మా పెద్ద దిక్కు చనినపోయిన తర్వాత మా కుటుంబం చిన్నాభిన్నమైపోయింది. ఇప్పుడు రైతులు సుఖంగా ఉన్నారు. మూడుగంటల కరెంట్ ఇస్తే.. సరిపోదు. 10 హెచ్పీ మోటారే ఉండదు. 2 ఇంచుల నీళ్లకు 3 హెచ్పీ మోటారు సరిపోతది. ఒక ఎకర భూమి కూడా పారదు. 60 ఏండ్ల నుంచి చేయని కాంగ్రెస్ ఇప్పుడు చేస్తదా..? అని అతను ప్రశ్నించాడు.