నెక్కొండ, ఫిబ్రవరి2 : ఆటలాడుకుంటున్న రెండేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు చేదబావి( well)లో పడి మృతి చెందిన ఘటన వరంగల్(Warangal) జిల్లా నెక్కొండ(Nekkonda)లో శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్ఐ జానీబాషా తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్రాష్ట్రానికి చెందిన నోవెల్ బాగెల్-రజిని దంపతులు బతుకుదెరువు కోసం ఆరు నెలల కిందట నెక్కొండకు వచ్చి పానీపూరి అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు.
వీరి రెండేళ్ల కుమారుడు కార్తీక్ శుక్రవారం ఉదయం ఆటలాడుకుంటూ చేదబావివద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు అందులో పడిపోయాడు. ప్రమాదాన్ని పసిగట్టిన తల్లి రజిని అరవడంతో తండ్రి నోవెల్ కొడుకును రక్షిం చేందుకు చేదబావిలోకి వెంటనే తాడుసాయంతో దిగాడు.
తండ్రి చూస్తుండగానే కార్తీక్ బావిలోని నీళ్లలోకి పూర్తిగా మునిగాడు. సమాచారం అందుకున్న ఎస్ఐ ప్రమాదస్థలికి చేరుకొని అగ్నిమాపక సిబ్బంది సహాయంతో మృతదేహాన్ని వెలికితీశారు. చేదబావిపై రేకులు లాంటివి మూతవేసినప్పటికి అవి పటిష్టంగా లేకపోవడంతోనే ప్రమాదం సంభవించింది. ఆటలాడుకుంటున్న కొడుకు కళ్లెదుటే బావిలోపడి దుర్మరణం పాలవడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.