హైదరాబాద్, హ్యూస్టన్: అమెరికాలో ఓ తెలంగాణ విద్యార్థిని మరో విద్యార్థి హత్య చేశాడు. మధిర పట్టణానికి చెందిన మహంకాళి అఖిల్సాయి (25) 13 నెలల క్రితం అమెరికా వెళ్లాడు. ఆబర్న్ యూనివర్సిటీలో చదువుతూ ఓ గ్యాస్ స్టేషన్లో పార్ట్టైమ్ ఉద్యోగం చేస్తున్నాడు. గోలి రవితేజ(23) అనే మరో తెలుగు విద్యార్థి ఆదివారం రాత్రి అఖిల్పై కాల్పులకు పాల్పడ్డాడు. దీంతో అఖిల్ తలలోకి బుల్లెట్ చొచ్చుకెళ్లింది. వెంటనే అతడిని దవాఖానకు తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్టు డాక్టర్లు ధ్రువీకరించారు. ఈ ఇద్దరూ అలబామా రాజధాని మాంట్గోమెరీలో నివసిస్తున్నారు.
హత్య ఆరోపణలతో రవితేజను పోలీసులు అరెస్టు చేశారు. అయితే, ఇద్దరి మధ్య ఎందుకు వివాదం తలెత్తింది ? హత్యకు కారణాలేంటనేది పోలీసులు ఇంకా గుర్తించలేదు. ముందుగా ఇది ప్రమాదవశాత్తూ జరిగిందనే వార్తలు వచ్చాయి. సెక్యూరిటీ గార్డ్ దగ్గర ఉన్న గన్ తీసుకొని చూస్తుండగా అది పేలి అఖిల్ మరణించాడనే వార్తలు రాగా స్థానిక మీడియా మాత్రం ఇది హత్యగా పేర్కొంది. కాగా, అఖిల్సాయి మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకువచ్చేందుకు సహాయం చేయాలని కేంద్రాన్ని అతడి కుటుంబం కోరింది. సాయి కుటుంబానికి అన్ని విధాలుగా సాయం చేస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు.