హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బీజేపీకి విచిత్ర పరిస్థితి తలెత్తింది. ఆ పార్టీకి ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలు తలోదిక్కుకు అన్నట్టుగా ఉన్నారు. రాజాసింగ్ విద్వేష వ్యాఖ్యలు చేసి జైలులో ఉండగా, రఘునందన్రావు ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు. అందుబాటులో ఉన్నది ఈటల రాజేందర్ మాత్రమే. శాసనసభ సమావేశాలకు ముందు నిర్వహించే బీఏసీ సమావేశానికి ఎవరిని పంపాలో కూడా ఆ పార్టీ నేతలకు అర్థం కావడంలేదు. బీజేపీ శాసనసభ పక్షనేత రాజాసింగ్ జైల్లో ఉండటంతో రఘునందన్కు ఆ పదవి ఇస్తారని భావించారు. ఆయన కూడా ఆశించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈటల తప్ప మరో అవకాశం లేదు. ఈటల ఇప్పటికే చేరికల కమిటీ చైర్మన్గా ఉండగా, ఇప్పుడు శాసనసభ పక్ష నేత పదవి కూడా ఇస్తే రఘునందన్రావు అలుగుతారేమోనని పార్టీ పెద్దలు మదన పడుతున్నారని తెలిసింది. ఒక వ్యక్తికి రెండు పదవులు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తారని యోచిస్తున్నట్టు సమాచారం.