గంగాధర, మార్చి 20: సెర్ప్ ఉద్యోగులు ప్రభుత్వానికి చెప్తున్న కృతజ్ఞతలను చేతల్లో చూపించాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సూచించారు. ఈ మేరకు ఆయన కరీంనగర్ జిల్లా గంగాధర మండలం బూరుగుపల్లిలోని సెర్ప్ ఉద్యోగులతో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ నివాసంలో ఫోన్లో మాట్లాడారు. అంతకు ముందు సెర్ప్ ఉద్యోగులు బూరుగుపల్లిలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఎమ్మెల్యే నివాసంలో సహపంక్తి భోజనాలు చేస్తున్న సమయంలో మంత్రి కేటీఆర్కు ఎమ్మెల్యే ఫోన్ చేశారు. ఈ సందర్భంగా సెర్ప్ ఉద్యోగులు మంత్రితో మాట్లాడి తమ సంతోషాన్ని పంచుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పేస్కేల్ వర్తింపజేసినందుకు జీవితాంతం రుణపడి ఉంటామని మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. దీనికి మంత్రి స్పందిస్తూ.. కృతజ్ఞతలు మాట ల్లో కాదు చేతల్లో చూపాలని మంత్రి సెర్ప్ ఉద్యోగులకు చెప్పారు. త్వరలోనే సెర్ప్ ఉద్యోగుల కుటుంబాలతో హైదరాబాద్లో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేస్తామని, దీనికి మం త్రులు, సమయం ఉంటే సీఎం కేసీఆర్ హాజరవుతారని కేటీఆర్ తెలిపారు. ‘రాష్ట్రంలో ప్ర స్తుతం జరుగుతున్న పరిణామాలను మీరు గమనిస్తున్నారు. సీఎం కేసీఆర్ను రాజకీయం ఎదుర్కొనే దమ్ములేక ప్రధానమంత్రి మా ఇంటి ఆడబిడ్డను ఇబ్బంది పెడుతున్నారు. దీనిని మహిళల్లో చర్చకు తీసుకొచ్చి విస్తృతంగా ప్రచారం చేయాలి’ అని మంత్రి కేటీఆర్ వారికి సూచించారు.